అదృశ్యమైన విద్యార్థి మరణించాడు
ఫోరెన్సిక్ డెంటల్ పరీక్షల తర్వాత శవం సునీల్ త్రిపాఠీదేనని తేల్చారు. అయితే, అతని మరణానికి కారణాలేమిటనేది ఇంకా తెలియలేదు. ఇండియన్ పాయింట్ పార్కు నీళ్లలో త్రిపాఠీ శవాన్ని బ్రౌన్ బృందం కనిపెట్టింది. త్రిపాఠీ మార్చి నెల మధ్యలో కనిపించకుండా పోయాడు. అతని కోసం బంధువులు గాలింపు చర్యలు చేట్టారు. అతను బ్రౌన్ విశ్వవిద్యాలయంలో చదువుతుండేవాడు.
ఈ నెల 23వ తేదీన సునీల్ త్రిపాఠీ మరణించినట్లు ధ్రువీకరించుకున్నారు. నెలకు పైగా తమ కమ్యూనిటీ సునీల్ త్రిపాఠీ కోసం నిరంతరం శ్రమించిందని, గాలింపులో త్రిపాఠీ కుటుంబానికి సహకరించిందని బ్రౌన్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ క్రిస్టినా పాక్సటన్ చెప్పారు. సునీల్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.
త్రిపాఠీ మార్చి 16వ తేదీన క్యాంపస్ సమీపంలోని అపార్టుమెంటు నుంచి వెళ్లిుపోయాడు. తన వెంట వాల్లెట్, గుర్తింపు కార్డు, సైకిల్ వంటివి తీసుకుని వెళ్లలేదు. ఆ తర్వాత అతను తిరిగి రాలేదు. త్రిపాఠీ కోసం రోడ్ ఐలాండ్ ప్రొవిడెన్స్ పోలీసులు విస్తృతంగా గాలించారు. అతని మిత్రులు, కుటుంబ సభ్యులు కూడా గాలిస్తూ నగరమంతా పోస్టర్లు వేశారు, ఫేస్బుక్ పేజ్ తెరిచారు.