నెలనెలా వెన్నెల: సాహిత్యంలో రసజ్ఞత, సింహావలోకనం
టెక్సస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఆదివారం, డిసెంబర్ 17న సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన జరిగింది.
ప్రవాసంలో నిరాటంకంగా 125 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేసారు.
ప్రార్థనా గీతంతో ప్రారంభం
కార్యక్రమములో ముందుగా ప్రముఖ సినీ గాయని నూతన మోహన్ ప్రార్థనా గీతం ఆలపించారు, పిమ్మట స్వాతి కిరణం చిత్రం లోని ‘ఆనతి నీయరాహరా' పాటను ఆలపించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు.
పురాన పఠనం చేశారు..
కొరివి చెన్నారెడ్డి ‘కంకటి పాపరాజు' కవి రచించిన ‘ఉత్తర రామాయణం'లోని ‘అన్నదాన ఫల మహత్యం' పురాణ పఠనం చేసారు. శ్రీమతి పాలపర్తి ఇంద్రాణి 125వ సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసి తెలుగు వారిది ఉత్తమ అభిరుచితో కూడిన జీవన విధానం.
అప్పటి నుంచి ఇప్పటి వరకు..
ఇందుకు సంబంధించి అనేక ఉదాహరణలు మనకు శ్రీనాధుని దగ్గరనించి బాపూ గారి వరకూ రసమయ జగతిలో ఎందరో మహానుభావుల సాహిత్యంలో లభిస్తాయి. మన ఆహారవిహారాలు,ఆట,పాట,మాట అన్నీ రసమయమే. ఈ విశేషాలన్నీ ఒకచోట ప్రోది చేసిటాంటెక్స్ తెలుగు సాహిత్య వేదికపై 'సాహిత్యంలో రసజ్ఞత' గా ప్రసంగించగా, విని ఆహూతులు ఎంతగానో ఆనందించారు.
పాలపర్తి ఇంద్రాణి కవితా సంకలనం
పాలపర్తి ఇంద్రాణి రచించిన- మూడో కవితాసంకలనం,'ఇంటికొచ్చిన వర్షం'; తల్లీ పిల్లల హృద్యమైన సంభాషణల పుస్తకం,'చిట్టి చిట్టి మిరియాలు'; మొదటి నవలిక, 'ఱ' పుస్తకాలు సాహితీ మిత్రులచే ఇదే వేదికపై ఆవిష్కరించబడ్డాయి. తదనంతరం శ్రీ మద్దుకూరి చంద్రహాస్ ఆవిష్కరించబడిన పుస్తకాలను శ్రోతలకు పరిచయం చేసారు.
సింహావలోకనం ఇలా..
ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశం ‘సింహా వలోకనం' 2017వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు నెల నెలా జరిగిన సాహిత్య సదస్సులను గుర్తుచేసుకోవటం ఒక విశేషం. ఇది తమదైన శైలిలో ప్రేక్షకులకు మరొక్కసారి గుర్తుచేసారు కార్యక్రమ సమన్వయకర్త శ్రీమతి శారద సింగిరెడ్డి.
సత్కారం ఇలా..
సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ ముఖ్య అతిథిని పుష్పగుచ్ఛముతో సత్కరించగా అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణా రెడ్డి, ఉత్తరాధ్యక్షులు శీలం కృష్ణవేణి దుశ్శాలువా మరియు కార్యక్రమ సమన్వయకర్త సింగిరెడ్డి శారద మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
వీరంతా పాల్గొన్నారు..
ఈ కార్యక్రమంలో తక్షణ పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, సమ్యుక్త కార్యదర్శి కోడూరు కృష్ణారెడ్డి సాహిత్య వేదిక బృంద సభ్యులు తెలకపల్లి జయ, కర్రి శశి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కృతజ్ఞతలు ఇలా..
సమన్వయకర్త సింగిరెడ్డి శారద సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభి మానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ 5, టి.ఎన్.ఐ, ఏక్ నజర్ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.