సాహిత్య అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సిధారెడ్డి..
సాహిత్య అకాడమీ తరుపున పనిచేయడం తన చిరకాల స్వప్నం అని బాధ్యతల స్వీకరణ సందర్భంగా సిధారెడ్డి చెప్పారు. సాహిత్య పరంగా తెలంగాణను మరింత ముందుకు నడిపించడానికి కృషి చేస్తానని తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్గా కవి, రచయిత నందిని సిధారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రవీంద్రభారతిలో కేటాయించిన ఛాంబర్ లో పలువురు ప్రముఖుల సమక్షంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఆచార్య ఎన్.గోపి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. సాహిత్య అకాడమీ బాధ్యతలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఆ మద్దతు ఎప్పుడూ ఉండాలి:
తెలంగాణ కవులు, రచయితల నుంచి తనకు ఎల్లప్పుడూ మద్దతు ఉండాలని సిధారెడ్డి ఆకాంక్షించారు. సాహిత్య అకాడమీ కోసం తపన పడ్డా.. కవులు, రచయితలే తన సంపద అని పేర్కొన్నారు. సాహిత్య అకాడమీ ద్వారా విస్తృతమైన పరిశోధనలు చేస్తామన్నారు.
కొత్త తరాన్ని ప్రోత్సహించేలా:
కొత్త తరం కవులను, రచయితలను ప్రోత్సహించేలా సాహిత్య అకాడమీ తరుపున కృషి చేస్తామని సిధారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలను జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సభలను ఘనంగా నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సాహిత్య అకాడమీ నా స్వప్నం:
సాహిత్య అకాడమీ తరుపున పనిచేయడం తన చిరకాల స్వప్నం అని బాధ్యతల స్వీకరణ సందర్భంగా సిధారెడ్డి చెప్పారు. సాహిత్య పరంగా తెలంగాణను మరింత ముందుకు నడిపించడానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
సాహిత్యంలో మంచి పేరు:
నందిని స్థాపించిన మంజీరా రచయితల సంఘం తెలంగాణలో చాలా పేరు ప్రతిష్ఠలను సంపాదించింది. ప్రాణిహిత కవితా సంకలనంతో ఆయన కవితాయాత్ర ప్రారంభమైంది. నాగేటి చాళ్లల్ల నా తెలంగాణ.. నా తెలంగాణ అనే పల్లవితో సిధారెడ్డి రాసిన పాట తెలంగాణ ప్రతీ పల్లెలో ప్రతిధ్వనించింది.