పాత వాదన: 'కొత్త'గా తెరపైకి తెచ్చిన కిషోర్
తెలంగాణ - హైదరాబాద్ యుటి, తెలంగాణ - హైదరాబాద్ రెండు రాష్ట్రాల రాజధాని, హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ, రాయల తెలంగాణ.. వంటి అంశాలు మాత్రమే ఎక్కువగా ఇటీవల చర్చకు వచ్చాయి. అనంతపురం, కర్నూలు జిల్లా నేతలతో పాటు మజ్లిస్ పార్టీ కూడా రాయల తెలంగాణకు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, రాయల తెలంగాణ, హైదరాబాదును ఏం చేయాలనే దానిపై ఢిల్లీలో తర్జన భర్జన జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.
రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వంటి నేతలు విభజిస్తే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, కిషోర్ డిమాండుతో ఇది ఢిల్లీ స్థాయిలో చర్చకు దారి తీసింది. రాష్ట్రాన్ని మూడుగా విభజించాలని ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. రాయలసీమను కూడా ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే మూడు ప్రాంతాల ప్రజలు శాంతిస్తారని అభిప్రాయపడ్డారు.
ఆంధ్ర రాష్ట్రానికి విశాఖను రాజధాని చేయా లని, ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఓడరేవు తదితరాలతోపాటు కావల్సినంత భూమి ఉందన్నారు. హైదరాబాద్లో సీమాంధ్రుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని, ఇక్కడి రూ.90వేల కోట్ల ఆదాయాన్ని న్యాయంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మూడు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాల కల్పనకు భారీ ప్యాకేజీ ప్రకటించాలని కోరారు.
రాయలసీమను రాష్ట్రం చేస్తే అది 8 లోక్సభ స్థానాలతో కనీసం పది రాష్ట్రాలకంటే ఎక్కువ విస్తీర్ణంతో ఏర్పడుతుందన్నారు. విభజనపై కాంగ్రెస్ నిర్ణయం తిరుగులేనిదని తెలుసునన్నారు. అయితే, ఊహాజనిత అంచనాలతో, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తొందరపాటుతో తీసుకున్నదిగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కొందరు తెలంగాణ నేతలను, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను మాత్రమే సంప్రదించి విభజన నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
కోర్కమిటీ కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ను మాత్రమే సంప్రదించిందన్నారు. రాష్ట్రాన్ని విభజించాలన్న ఆతురతతో బొత్స వ్యవహరించారని, అప్పుడు సీమాంధ్రకు సిఎం కావాలన్న తన ఏకైక లక్ష్యం నెరవేరుతుందని ఆయన ఆశించారని ఆరోపించారు. అదే సమయంలో తెలంగాణ ప్రతిష్ఠంభన కొనసాగితే 2014 వరకూ తన పదవి సురక్షితంగా ఉంటుందని కిరణ్ ఆశించారని ఆరోపించారు. ఇద్దరు స్వార్థంతో ఆలోచించాలని మండిపడ్డారు.
రాయలసీమ, ఆంధ్ర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులు తెలంగాణ వదిలివెళ్లాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన ప్రకటనతో అభద్రత భావం ఏర్పడిందన్నారు. ఈ రెచ్చగొట్టే ప్రకటనలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. అయితే, కిషోర్ చంద్రదేవ్ మూడు రాష్ట్రాల డిమాండుపై జోరుగా చర్చ సాగుతోంది.