ట్రాజెడీ: టిడిపికి ప్రమాదాల శాపమేమిటో..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి ప్రమాదాలు శాపంగా పరిణమించాయి. పార్టీకి నిబద్దతతో పనిచేస్తూ ప్రజల్లో ఆదరణ పొందిన నాయకులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం పార్టీకి పెద్ద దెబ్బగా పరిణమిస్తోంది. తాజాగా, సీనియర్ నేత లాల్ జాన్ బాషా మృతి తెలుగుదేశం పార్టీని విషాద సముద్రంలో ముంచెత్తింది. తెలుగుదేశం పార్టీ దళిత నేతగా ఎదిగి, లోకసభ స్పీకర్ పదవిని చేపట్టిన జిఎంసి బాలయోగి, ఉత్తరాంధ్రలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే కింజరాపు ఎర్రన్నాయుడు, మైనారిటీ నాయకుడు లాల్ జాన్ బాషా ప్రమాదాల్లో అర్థాంతరంగా అసువులు బాశారు.
లోక్ సభకు స్పీకర్గా ఎన్నికైన తొలి దళిత నేతగా రికార్డులకెక్కిన బాలయోగి ఓ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. 2002 మార్చి 3న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపంతో కుప్పకూలింది. కృష్ణా జిల్లా కువ్వడలంక వద్ద ఓ కొబ్బరిచెట్టుకు తగిలిన ఆ చాపర్ సమీపంలోని చేపల చెరువులో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో బాలయోగి అక్కడిక్కడే మరణించారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి అండదండగా నిలిచిన కింజరాపు ఎర్రన్నాయుడు కూడా అకస్మికంగా మృతి చెంది పార్టీ వర్గాలను తీరని విషాదంలో ముంచెత్తారు. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆయన అత్యంత కీలకమైన నేతగా ఉండేవారు. నిరుడు నవంబర్ 2న విశాఖపట్నంలో ఓ వివాహానికి హాజరై తిరిగి శ్రీకాకుళం వస్తూ, రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఓ ట్యాంకర్ను ఢీకొనడంతో ఆయన ప్రాణాలు విడిచారు.
గురువారం ఉదయం గుంటూరుకు చెందిన లాల్ జాన్ బాషా రోడ్డు ప్రమాదంలో మరణించారు. బాషా ప్రయాణిస్తున్న వాహనం డివైడర్ను ఢీకొట్టడంతో ఆయన మృతి చెందారు. తెలుగుదేశం పార్టీకి బాషా మృతి తీరని లోటు. నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన బాషా పార్టీలో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు.