కిరణ్ను ఏకాకిని చేసి టి: వారితో ఢిల్లీ దూకుడు!
హైదరాబాద్/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిడబ్ల్యూసి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం అదే స్థాయిలో తెలంగాణపై దూకుడుగా వెళ్తోన్నట్లుగా కనిపిస్తోంది. సిడబ్ల్యూసి నిర్ణయం వచ్చినప్పటి నుండి విలేకరుల సమావేశంలో, పలు కార్యక్రమాల వేదికలపై ముఖ్యమంత్రి సమైక్యవాదాన్ని బలంగా వినిపించారు. విభజనపై ముందుకు వెళ్ళేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకున్న సమయంలో కిరణ్ వారికి కొరకురాని కొయ్యగా మారారు.
ఈ నేపథ్యంలో ఆయన వ్యతిరేక వర్గం అండతో అధిష్టానం తెలంగాణపై ముందుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. విభజనను కిరణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయనను పక్కన పెట్టైనా విభజన దిశగా వెళ్లేందుకు సిద్ధమవుతోంది. గురువారం కేబినెట్ నోట్ వచ్చే అవకాశముంది. దీనిని త్వరలో అసెంబ్లీకి ఆమోదం కోసం పంపించనున్నారు.
అసెంబ్లీలో నెగ్గించడం కోసం...
అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని నెగ్గించేందుకు అధిష్టానం పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. కిరణ్ ప్రమేయాన్ని తప్పించి తీర్మానాన్ని నెగ్గించేందుకు అధిష్టానం చూస్తోందట. కిరణ్ కుమార్ రెడ్డిని మార్చుతారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనను మార్చి అయినా తీర్మానం నెగ్గించుకునేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చేస్తోంది. విభజనకు కిరణ్, మంత్రులు శైలజానాథ్, ఎంపీలు లగడపాటి రాజగోపాల్ వంటి కొందరు మాత్రమే వ్యతిరేకిస్తున్నారట.
సీమాంధ్ర కాంగ్రెసు పార్టీలోని చాలామంది నేతలు విభజనకు అనుకూలంగా ఉన్నట్లుగా వారి ప్రకటనల ద్వారా అర్థమవుతోంది. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు రెండు రోజుల క్రితం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి భేటీ కిరణ్కు వ్యతిరేకంగా అనే ప్రచారం సాగింది. ఆ తర్వాత బుధవారం మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. విభజనను వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు.
పలువురు సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తాము సమైక్యవాదులమేనని చెబుతూనే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు. విభజన అనివార్యమైతే సీమాంధ్ర ప్రయోజనాల కోసం డిమాండ్ చేస్తామని ఇంకొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ను తీర్మానం సమయానికి పక్కన పెట్టి నెగ్గించుకోవాలని అధిష్టానం చూస్తోందట. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిలు సమైక్యాంధ్ర అంటున్నప్పటికీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమంటున్నారు. అలాంటి వారి ద్వారా తీర్మానాన్ని నెగ్గించుకునేందుకు అధిష్టానం సిద్ధపడుతోంది.
రాష్ట్రపతి ప్రకటన
అసెంబ్లీలో తీర్మానం వీగిపోతే తెలంగాణ బిల్లును పక్కన పెడతానని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సీమాంధ్ర నేతలకు చెప్పినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. ప్రణబ్ వ్యాఖ్యల నేపథ్యంలోనే అసెంబ్లీలో బిల్లును నెగ్గించేందుకు అధిష్టానం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందంటున్నారు. ధిక్కార స్వరం వినిపిస్తున్న కిరణ్ను ఏకాకిని చేసి సమస్యకు ఓ పరిష్కారం చూపించేందుకు సిద్ధమైంది. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించైనా ముందుకెళ్తారని అంటున్నారు. మరోవైపు అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం ఉండదని చర్చ మాత్రమే ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.