‘కాంగ్రెస్ అధ్యక్షుడిగా నితీష్’: తెరపైకి సంచలన డిమాండ్
కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై తెరపైకి మరో సంచలన డిమాండ్ తెరపైకి వచ్చింది. నాయకత్వ లోపంతో జవసత్వాలను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ని అధ్యక్షుడిగా నియమించాలని
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై తెరపైకి మరో సంచలన డిమాండ్ తెరపైకి వచ్చింది. నాయకత్వ లోపంతో జవసత్వాలను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ని అధ్యక్షుడిగా నియమించాలని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ సంచలన ప్రకటన చేశారు. అది జరిగినప్పుడే కాంగ్రెస్ ప్రజాదరణ సాధించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు నితీష్ కావాలి..
స్నేహపూర్వక వాతావరణంలో జేడీయూ నేత నితీశ్.. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాలని ఆయన కోరడం గమనార్హం. ‘సరైన నాయకుడు లేని పార్టీ కాంగ్రెస్.. సరైన పార్టీ లేని నాయకుడు నితీశ్' అని రామచంద్రగుహ వ్యాఖ్యానించారు. నితీష్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కొనే సత్తా వస్తుందని తెలిపారు.
Recommended Video
నితీష్ లాంటి వ్యక్తి అరుదు
‘మతం, జాతి, లింగ వివక్షకు దూరంగా ఉండే స్వభావం నితీశ్ది. ఇటువంటి రాజకీయ నాయకులు దేశంలో అరుదుగా ఉంటారు'ని రామచంద్ర గుహ అన్నారు. 131 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో భారత రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించడం కష్టమేనని రామచంద్ర గుహ అభిప్రాయపడ్డారు.
రాహుల్ నాయకత్వంపై?
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ నాయకత్వంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో రామచంద్ర గుహ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, ఈ మధ్యలో ఏమైనా మార్పులు సంభవించవచ్చన్నారు. ఏక పార్టీ వ్యవస్థ ఎప్పుడైనా దేశానికి ప్రమాదరకరమని, నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలో తేలిందన్నారు.
ఏక పార్టీ పాలన వద్దు..
గడిచిన 70 సంవత్సరాల్లో ద్విపార్టీ పరిపాలనతో తమిళనాడు, కేరళ, హిమాచల్ప్రదేశ్ వంటి మూడు రాష్ట్రాలు ఆర్థికంగా, సామాజికంగా అద్భుతమైన పనితీరును ప్రదర్శించాయని చెప్పారు. ఏళ్ల తరబడి ఏక పార్టీ పరిపాలన కొనసాగిన పశ్చిమబెంగాల్, గుజరాత్లో పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు.
కాంగ్రెస్, నితీష్ స్పందించలేదు..
రాష్ట్రాల్లో రెండు పార్టీల వ్యవస్థ స్థిరంగా ఉంటే అత్యుత్తమంగా పాలన అందించే అవకాశముందని రామచంద్ర గుహ అభిప్రాయపడ్డారు. అయితే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా నితీష్ కుమార్ను చేయాలన్న రామచంద్రగుహ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ గానీ, ఇటు నితీష్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు.