Varalakshmi Vratham 2021 : కలశ స్థాపన.. పూజా విధానం ; నైవేద్యాలు, వరలక్ష్మీ వ్రత కథ ప్రాశస్త్యం ఇదే !!
శ్రావణ మాసం వచ్చిందంటే తెలుగువారి ఇళ్ళ లోగిళ్ళలో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. మహిళలు మహాలక్ష్మీ స్వరూపులుగా కనిపిస్తారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలతో భక్తిలోకంలో మునిగిపోతారు. అందులోనూ శ్రావణమాసం అనగానే ముందు గుర్తొచ్చేది వరలక్ష్మీ వ్రతం. హిందువులంతా అత్యంత పవిత్రంగా జరుపుకొనే వరలక్ష్మీ వ్రతం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో వరలక్ష్మీ వ్రతానికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. ముత్తయిదువులు అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని పూజించి, వ్రతాన్ని ఆచరించి ఈ నోమును నోచుకుంటారు. వరలక్ష్మీదేవి సకల శుభాలను చేకూర్చి, ఆయురారోగ్య, అష్టైశ్వర్య, భోగ భాగ్యాలతో తులతూగేలా తమ కుటుంబాలను చల్లగా చూస్తుందని మహిళలు చాలా ప్రగాఢంగా విశ్వసిస్తారు.

వరలక్ష్మీ వ్రతం రోజు ఆచరించాల్సిన నియమాలివే
మహిళామణులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే మంగళప్రదమైనదిగా, శుభదాయకమైనదిగా భావించే వరలక్ష్మీ వ్రతాన్ని ఎలా ఆచరిస్తారో తెలుసుకుందాం. వరలక్ష్మీ వ్రతం రోజున మహిళలు తెల్లవారుజామునే లేచి, అభ్యంగన స్నానమాచరించి, ఇంటి ముందు ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి,వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టి, గుమ్మాలకు మంగళ తోరణాలతో అలంకరించి, గడపలను పసుపు కుంకుమ తో పూజిస్తారు. ఇల్లంతా శుద్ధి చేసుకుని ఇంట్లో తూర్పు దిక్కున మండపాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ మండపాన్ని అరటి పిలకలు పువ్వులు మామిడి తోరణాలతో అలంకరించి అమ్మవారి పూజకు ఏర్పాట్లు చేస్తారు.

మడపం ఏర్పాటు, కలశ స్థాపన విధానం ఇదే
వరలక్ష్మీ వ్రతాన్ని చేసే మహిళలు ముందుగా మండపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. మండపంలో బియ్యం పోసి అందంగా తీర్చిదిద్ది అందులో కలశాన్ని ఉంచి మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుళ్లను అందులో వేయాలి. కలశంపై కొబ్బరికాయ నుంచి దానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి దానిని ఎరుపు రంగు జాకెట్ ముక్క తో అలంకరించాలి. ఇక అమ్మవారి ముఖాన్ని కలశం పైన అందంగా అమర్చుకోవాలి. పసుపుతోనైనా, బియ్యంపిండి, మైదా పిండితో గానీ అమ్మవారి ముఖాన్ని తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లోనూ అమ్మవారి విగ్రహాలు అందుబాటులో ఉంటున్నాయి. లేదంటే అమ్మవారి చిత్రపటాలను కూడా ఏర్పాటు చేసుకుని పూజించవచ్చు.

వరలక్ష్మీ అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు .. ఎక్కువగా చేసే నైవేద్యాలు ఇవే
వరలక్ష్మీ వ్రతం నాడు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడానికి మల్లెలు, సంపెంగలు, మొగలి పువ్వులు, కలువ పువ్వులు వంటి రకరకాల పువ్వులను ఉపయోగించవచ్చు . వరలక్ష్మీ వ్రతం నాడు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి తొమ్మిది రకాల పిండివంటలు చేయాలని పెద్దలు చెప్తారు. ముఖ్యంగా చాలా మంది అమ్మవారికి పూర్ణాలు, గారెలు, బూరెలు, పరమాన్నం, పులిహోర, బొబ్బట్లు, చలిమిడి, వడపప్పు, శనగలు నైవేద్యంగా నివేదిస్తారు. తొమ్మిది రకాల వంటలు చేయలేని వాళ్ళు తమకు చేతనైనన్ని చేసుకోవచ్చని కూడా పెద్దలు చెప్తారు .అయితే అత్యంత భక్తి భావనతో అమ్మవారిని పూజించడమే ప్రధానమని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి.

వరలక్ష్మీ అమ్మవారి పూజా విధానం
చక్కగా మండపాన్ని సిద్ధం చేసుకున్న తరువాత, తొమ్మిది రకాల పిండివంటలను సిద్ధం చేసి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ప్రారంభించటానికి ముందు వరలక్ష్మీ దేవిని చక్కగా పువ్వులు ఆభరణాలతో అలంకరించి ఆ తల్లిని ఆవాహన చేయాలి. అమ్మవారు ఇంట్లోనే కూర్చున్నారా అన్నట్టు మహిళలు చక్కగా అమ్మవారిని అలంకరించి ఆవాహనం చేస్తారు .వరలక్ష్మి అమ్మవారిని కీర్తిస్తూ అష్టోత్తర శత నామాలతో అర్చన చేయాలి. అమ్మవారికి ధూపదీపాలు నైవేద్యాలను సమర్పించి, వరలక్ష్మీ వ్రత కథను చదివి ఆ తల్లి మహత్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. అమ్మవారి పూజలో అష్టోత్తర శతనామావళికి ఒక విశిష్టత ఉంది. వరలక్ష్మీదేవి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కథ ఉందని పురాణాలు చెబుతున్నాయి.

అమ్మవారి మహత్యాన్ని చెప్పే వరలక్ష్మీ వ్రత కథ
ఇక వరలక్ష్మి వ్రత కథ విషయానికి వస్తే పూర్వం మగధ దేశంలో కుండినమనే పట్టణంలో చారుమతి అనే మహాసాధ్వి అయినా ఓ బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సత్ప్రవర్తన కలిగి, వినయవిధేయతలతో భర్తను, అత్తమామలను సేవిస్తూ జీవనం సాగించేది. ఆమె వినయవిధేయతలకు మెచ్చి మహాలక్ష్మీదేవి ఆమెకు స్వప్నంలో సాక్షాత్కరించి ఆమెకు వరలక్ష్మీ వ్రతాన్ని ఉపదేశించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయని చెప్పింది. ఆ ప్రకారం చారుమతి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలు పొందుతుంది. అప్పటి నుండి ముత్తయిదువులు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించటం ఆనవాయితీగా పెట్టుకున్నారు.

ముత్తయిదువుల ఆశీర్వాదంతో ముగింపు .. వరలక్ష్మీ వ్రతం చేస్తే కలిగే ఫలితాలివే
ఇక శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో వారంతా సాయంత్రం ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలిచి కాళ్ళకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి వారికి పండు,తాంబూలాన్ని ఇచ్చి వారి దగ్గర నిండు నూరేళ్లు పసుపుకుంకుమలతో చల్లగా జీవించమని ఆశీర్వాదం పొందుతారు. ఈ విధంగా చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని మహిళలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అంతేకాదు శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం చేసుకునే వారికి అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయని చెప్తారు.

పూజల వెనుక పరమార్ధాలెన్నో.. సైంటిఫిక్ రీజన్స్ కూడా
శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతమే కాదు చేసే పూజలు , ఉండే ఉపవాసాల వల్ల ఆరోగ్యం బాగుంటుందని కూడా పెద్దలు చెప్తారు . పసుపు, కుంకుమలు శుభ ప్రదమే కాదు ఆరోగ్యదాయకం కూడా అని పెద్దలు చెబుతారు. పసుపులో క్రిమి సంహారక లక్షణాలు, ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని, దానివల్ల ముఖానికి, కాళ్ళకు పసుపు రాసుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే సీజనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయని కూడా చెప్తారు. వర్షాకాలంలో జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయని, అప్పుడప్పుడు ఉపవాసం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తారు.
-
ఈనెల 18 నుంచి చతుర్గ్రాహి యోగంతో ఈ రాశుల పంట పండింది -
సింహరాశి ఉగాది ఫలితాలు.. ఈ ఏడాది వీరికి గడ్డుకాలం.. అయినా సరే.. -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
మీనరాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల ఇంట్లోకి లక్ష్మీదేవి -
మఖ నక్షత్రంలోకి కేతువు.. మార్చి 29 నుండి ఈ రాశులవారికి అన్నీ శుభాలే! -
ఏప్రిల్ లో కుజ బుధుల సంయోగంతో వ్యూహాత్మక శక్తి యోగం.. వీరికి కుబేర కటాక్షం! -
today rashiphalalu: మీనరాశిలో త్రిగ్రహాలు వీరికి తిరుగులేని సంపదలు ఇస్తున్నాయి! -
today rashiphalalu: మీనరాశిలో శని అస్తమయం, కుంభరాశిలో బుధోదయంతో వీరికి సంపదల సంక్రాంతి -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!'












Click it and Unblock the Notifications