తెలంగాణ సంస్మరణ సభలో వైఎస్ ఫోటో పెట్టక పోవటం తప్పేనా!

వైఎస్ ఫోటో పెట్టక పోవటంపై స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన రాద్దాంతం అనవసరమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు బద్ద వ్యతిరేకి. అయితే చంద్రబాబునాయుడు సైతంన వ్యతిరేకి అయినప్పటికీ ఆయన ఆ విషయాన్ని బాహాటంగా ఒప్పుకోవటం లేదు. అయితే రాజశేఖర్ రెడ్డి కూడా తక్కువేమీ తినలేదు. 2004ఎన్నికలకు ముందు తెలంగాణకు అనుకూలమని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితితో చేతులు కలిపిన వైఎస్ ఆ తరువాత 2009 ఎన్నికల్లో ద్వంద రాజకీయం ప్రదర్శించారు. తెలంగాణలో మొదటి విడుత ఎన్నికలు ఉండటంతో అప్పటి వరకు తెలంగాణపై ఊసెత్తని వైఎస్ తెలంగాణలో ఎన్నికలు అయిపోగానే సీమాంధ్ర ఎన్నికలలో తెలంగాణ వెళ్లాలంటే వీసా కావాలని అక్కడి ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఆయన కుయుక్తులతో అక్కడి ఓట్లను కాంగ్రెస్ కు వేయించుకున్నారు. ఈ విషయాన్ని కెకె ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకి అయిన వైఎస్ ఫోటో పెట్టాలని అడగటం అవివేకమన్నారు. వీసా కావాలి అనటం తెలంగాణను, తెలంగాణ ప్రజలను కించపర్చటమే. దేశంలోని ఏ రాష్ట్రానికి వెళ్లడానికి ఎవరైవా వీసా తీసుకున్న సందర్భాలు ఉన్నాయా. తెలంగాణకు వ్యతిరేకమని సూటిగా చెప్పారు. తెలంగాణలో ఉన్న 120 సీట్లలో తమకు తక్కువ వస్తాయని గమనించిన వైఎస్ సీమాంధ్రలో ఓట్లు దండుకోవటానికి వారిని రెచ్చగొట్టేలా మాట్లాడారు. అందులో ఆయన సక్సేస్ అయ్యారనే చెప్పవచ్చు.
ఓట్లు కోసమే తెలంగాణను, తెలంగాణ ప్రజలను కించపర్చి, తెలంగాణకు వ్యతిరేకమని చెప్పిన వైఎస్ ఫోటోను తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారి ఫోటోల ప్రక్కన ఎలా పెట్టగలుగుతారు. అలా అయితే తెలంగాణ త్యాగధనులను అవమానపర్చినట్టు కాదా. వేర్పాటు వాదం సరియైనదా కాదా అనే విషయం పక్కన పెడితే ఒక లక్ష్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వారి పక్కన ఆ లక్ష్యాన్ని కించపర్చి ఆ లక్ష్యానికి వ్యతిరేకంగా పనిచేసిన వైఎస్ ఫోటో పెట్టమనటం సమంజసమా. తెలంగాణలో వైఎస్ కు వీరాభిమానులు ఉండవచ్చు. అది ఎవరూ కాదనలేని నిజం. ప్రతీ పార్టీలోను ప్రతీ నాయకుడికి అభిమానులుంటారు. వైఎస్ ది అంతే.
వైఎస్ ఫోటో పెట్టాలంటే ఆయన మరణానంతరం ఆయన కొడుకు,కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుండి అయినా తెలంగాణ ప్రజలకు స్పష్టమైన హామీ ఉండాలి. జగన్ నుండి సైతం అలాంటిది లేదు. ఆయన సైతం సమైక్యవాది అని చెప్పడానికి ఇటీవల మాజీ మంత్రి కొండా సురేఖ వాఖ్యలే మంచి నిదర్శనం.వైఎస్ జగన్ నిరంతరం సమర్థిస్తూ, రోశయ్యపై, రోశయ్య ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేసి సొంత పార్టీవారి ఆగ్రహంతో పాటు అధిష్టానం ఆగ్రహానికి సైతం గురైన సురేఖ ఒక్క తెలంగాణ విషయంలో మాత్రం జగన్ తో విభేదించింది. తన పార్టీ వారి నుండి, తన నియోజక వర్గంలోనే తన తెలంగాణవాదంపై ప్రశ్నలు తలెత్తుతుండటంతో సురేఖ జగన్ అభిమానిని అయినంత మాత్రాన తాను తెలంగాణ వాదిని కాకుండా పోతానా అని ఓ సభలో చెప్పారు. తాను తెలంగాణ కోసం పోరాడుతానని చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటూ సమైక్యమన్న వైఎస్ ఫోటోలను అమరవీరుల సంస్మరణ సభలో పెట్టమని డిమాండ్ చేయాలనటం వారి అవివేకానికో లేక వారి అనాగరికమో అనుకోవచ్చు.
వారు వైఎస్ ఫోటో పెట్టమని డిమాండ్ చేయటానికి అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదు. వారి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించటం. అది దాదాపు అన్ని పార్టీలు చేస్తున్నాయి. జగన్ ఓదార్పు వ్యక్తిగతమని అంటున్నారు. అందుకే ఆయనకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కూడా రాజీవ్, సోనియా ఫోటోలు దర్శనమివ్వటం లేదు. మొదట్లో కొందరు ఆ విషయంపై ప్రశ్నిస్తే అది పార్టీ యాత్ర కాదు. వ్యక్తిగత యాత్ర అన్నారు. అలాగే ఇది కూడా అంతే. ఇది పార్టీ మీటీంగ్ కాదు. తెలంగాణ అమరవీరుల కోసం ఏర్పాటు చేసిన సభ. అలాంటి సభలలో తెలంగాణ వ్యతిరేకులైన వైఎస్ కో, జగన్ కో, చంద్రబాబుకో, చిరంజీవికో, లగడపాటికో, మరెవరికో చోటు కావాలనటం హాస్యాస్పదం. జగన్, తెలంగాణ అమరవీరులకు వేరు వేరు న్యాయమే కాంగ్రెస్ న్యాయమా!












Click it and Unblock the Notifications