భద్రాద్రికి కొత్త సొబగులు: ఆలయ కొత్త నమూనాలు అద్భుతం(పిక్చర్స్)
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం మాదిరిగానే దక్షిణాదిఅయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రీ ఆలయం కూడా కొత్త సొబగులు సంతరించుకోనుంది. నూతన ఆలయ నమూనా తుది రూపం తాజాగా ఖరారైంది.
హైదరాబాద్/భద్రాచలం: యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం మాదిరిగానే దక్షిణాదిఅయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రీ ఆలయం కూడా కొత్త సొబగులు సంతరించుకోనుంది. నూతన ఆలయ నమూనా తుది రూపం తాజాగా ఖరారైంది. ప్రస్తుత ఆలయ మహారాజ గోపుర నమూనాలో ఎలాంటి మార్పులు చేయకుండానే ఆలయ ప్రాకారం, మాడవీధుల్లో మార్పులు చేపడుతారు.
స్వామివారి కళ్యాణ మండపం, బ్రహ్మోత్సవ మండపం, అన్నదాన సత్రాలను తిరిగి నిర్మిస్తారు. భద్రాద్రి ఆలయ ప్రాథమిక నమూనాను రూపొందించి ఇప్పటికే చినజీయర్ స్వామికి చూపించగా ఆయన సూచించిన మార్పులు, చేర్పులతో తిరిగి తుది నమూనా సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి పరిశీలన తర్వాత ఇదే తుది రూపంగా ఖరారు కానుంది.
రూ. 100కోట్లతో..
భద్రాచలం దేవస్థానం విస్తరణకు ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేస్తుందని, యాదాద్రి తరహాలో భద్రాద్రి దేవస్థానం అభివృద్ధికి కూడా ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం సచివాలయంలో భద్రాచలం అభివృద్ధి కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. ఆలయ విస్తరణ నమూనాపై దేవాదాయ కమిషనర్ శివశంకర్, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఆర్కిటెక్ట్ ఆనంద్సాయి తదితరులతో సమావేశం నిర్వహించారు.
సీఎం ఆమోదంతో..
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. భద్రాద్రి ఆలయ నూతన నమూనాను ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుకు పంపించాలని అధికారులతో చెప్పినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధిపై డీపీఆర్లను త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం అనుమతులు మంజూరు చేయించుకుని ఆగస్టు నెలలో టెండర్లను పిలిచి, నిర్మాణ పనులు చేపట్టే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేస్తుందని తెలిపారు.
నమూనాపై వివరించిన ఆర్కిటెక్ట్ ఆనంద్సాయి
భద్రాద్రికి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని ఈ సమావేశంలో చర్చించినట్లు మంత్రి మీడియాతో చెప్పారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూపొందించిన ప్లాన్ను ఆర్కిటెక్ట్ ఆనంద్సాయి ఈ సందర్భంగా మంత్రి తుమ్మలకు వివరించారు.
మాడవీధుల్లో మాత్రమే మార్పులు
ప్రధానంగా ఆలయ మహారాజ గోపుర నమూనాలో ఎటువంటి మార్పులు లేవని, ఆలయ ప్రాకారం, మాడవీధుల్లో మాత్రమే మార్పులు, చేర్పులు చేపట్టినట్లు తెలిపారు. స్వామివారి కల్యాణ మండపం, బ్రహ్మోత్సవ మండపం, అన్నదాన సత్రాలను పునర్నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆలయ నూతన నమూనాను చినజీయర్స్వామికి చూపించి వారు సూచించిన మార్పులతో తుది డిజైన్ రూపొందించామని పేర్కొన్నారు.
యాదాద్రి, వేములవాడతోపాటు..
కాగా, ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు భక్త రామదాసు ట్రస్టు ప్రాంగణం డిజైన్ను కూడా రూపొందించాలని మంత్రి ఆర్కిటెక్ట్కు సూచించారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఒక ప్రకటన చేస్తారని తుమ్మల వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా భద్రాద్రి ఆలయాన్ని యాదాద్రి, వేములవాడ తరహాలోనే వేగంగా అభివృద్ధి పర్చాలని, నిధులకు ఎలాంటి కొరత లేనందున పనులను సత్వరం పూర్తి చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు.