మిర్చి ఘాటు: హరీష్ రావు కన్నా చంద్రబాబు బెటర్
హైదరాబాద్ / అమరావతి: కార్పొరేట్లు, వ్యాపారుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పట్టించుకోవాల్సి వచ్చే సరికి నిబంధనల సాకుతో మొహం చాటేయడం మొదటి నుంచి జరుగుతున్న ప్రక్రియగానే ఉన్నది. అందునా వాణిజ్య పంట మిర్చి పండించిన రైతుల బాధలు చెప్పనలవి కాదంటే అతిశేయోక్తి కాదు.
గత ఏడాది క్వింటాల్ మిర్చి ధర రూ. 12 వేలు పలకడం చూసిన రైతు ఆశ పడ్డాడు. ఒక్క ఏడాది దిగుబడి బాగా వస్తే తన కష్టాలు తీరిపోతాయని కలలు కన్నాడు. వాతావరణం కూడా అనుకూలించడంతో దిగుబడి బాగానే వచ్చినా.. మార్కెట్ యార్డుల్లో వ్యాపారుల 'కళ్లు' మండాయి. ఈ పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నెలకొన్నది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మిర్చి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ పనీ చేయలేదు. కాకపోతే భారమంతా కేంద్ర ప్రభుత్వంపైనే వేసింది.
గమ్మత్తేమిటంటే మిర్చితోపాటు ప్రజలు ప్రతిరోజు వంటల్లో వాడే 'ఉల్లి' భారీగా దిగుబడి రావడంతో గతేడాది ప్రభుత్వమే.. ప్రత్యేకించి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీర్ హరీశ్ రావు ప్రత్యేక శ్రద్ధ, చొరవతో మార్కెటింగ్ శాఖ అధికారులు కిలో ఉల్లికి రూ.8 చొప్పున ధర చెల్లించి కొనుగోలు చేశారు.
మార్కెటింగ్ శాఖ గిడ్డంగుల నుంచి తర్వాత వ్యాపారుల వద్దకు చేరుకున్నాక దాని ధర మారిపోతుందన్న సంగతి వేరే చెప్పనక్కర్లేదు. అంతే కాదు పత్తి కొనుగోళ్లకు కేంద్రంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)తో సంప్రదింపులు జరిపి మరీ రాష్ట్రంలోని మార్కెట్ యార్డుల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. పత్తి రైతులకు ఉపశమన చర్యలు తీసుకున్నారు. అత్యంత కీలకమైన వాణిజ్య పంట మిర్చి రైతులను ఆదుకునేందుకు మార్క్ ఫెడ్, కేంద్రంలోని నాఫెడ్ తో ఎందుకు చర్చించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
కేంద్రంపైనే తెలంగాణ ప్రభుత్వ భారం
రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రిగానూ, మార్కెటింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి హరీశ్ రావు తన చాంబర్లోనే ఇటు మార్కెటింగ్, అటు సాగునీటి శాఖ పనితీరుపై ఆన్లైన్లో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారని వార్తలొచ్చాయి. రాష్ట్రంలోని మార్కెట్ యార్డులన్నీ మంత్రి చాంబర్ లోని నిఘా వ్యవస్థతో అనుసంధానం చేయడం వల్ల ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలిసిపోతాయని, ఆ వెంటనే పరిష్కార మార్గాలు చూపుతున్నారని ఆ వార్తల సారాంశం. అదే నిజమైతే నిజామాబాద్, హైదరాబాద్ లోని మలక్ పేట, వరంగల్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్లలో మిర్చి రైతులకు జరుగుతున్న అన్యాయం మంత్రి హరీశ్ రావుకు గానీ, ఆయన పరిధిలోని మార్కెటింగ్ శాఖ అధికారులకు గానీ కనిపించడం లేదా? అని రైతులు అనుమానిస్తున్నారు.
గిట్టుబాటు ధరలు కల్పించాలని హైదరాబాద్ లోని మలక్ పేట వ్యవసాయ మార్కెట్ వద్ద మిర్చిరైతులు జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సంగతి తెలుసుకున్న అధికారులు రైతుల ప్రతినిధులతో చర్చించారు. వ్యాపారులతో మాట్లాడి గిట్టుబాటు ధర లభించేలా చూస్తామని మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించారే గానీ.. మార్క్ ఫెడ్, కేంద్రంలోని నాఫెడ్ రంగంలోకి దిగుతుందని ప్రకటించేందుకు సాహసించలేకపోయారని రైతులు ఆరోపిస్తున్నారు.
నిబంధనలు వర్తిస్తాయంటున్న ఏపీ సర్కార్
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నుంచి రైతులు మార్కెట్లో విక్రయించే ప్రతి క్వింటాల్ మిర్చికి రూ.1500 చొప్పున రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ప్రారంభం కానున్నది. ఒక్కో రైతుకు గరిష్ఠంగా 20 క్వింటాళ్లకు రూ.30 వేల పరిహారం అందనున్నదన్న వార్తలు సంతోషాన్ని కలిగిస్తున్నా, మార్కెట్లో విక్రయించిన మిర్చి ధరకు ప్రభుత్వం ఇచ్చే రూ.1,500 జోడిస్తే క్వింటాలు ధర రూ.8 వేలు దాటకూడదన్న నిబంధన విధించడంతో అన్నదాతలు మండిపడుతున్నారు.
గరిష్ఠ ధరపై ఏపీ సర్కార్ తీరుపై ఆగ్రహం
ప్రభుత్వం ప్రస్తుతం పరిహారం చెల్లింపుకు ప్రకటించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం ఈ పంటను రూ.8 వేల లోపు ధరకు అమ్ముకుంటేనే రాయితీ వస్తుంది. ఈ రాయితీ కోసం రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాలా? ప్రభుత్వం చేసిన అనాలోచిత చర్యల వల్ల ధరలు మరింత పతనమయ్యే పరిస్థితులు వచ్చాయి.పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉండాలన్న నిబంధనలతో రాష్ట్రంలో మూడు వంతులు పైగా మిర్చి పంటను పండిస్తున్న కౌలు రైతులకు పరిహారం అందే అవకాశం లేకుండా పోయింది.
కౌలు రైతులకేవీ గుర్తింపు కార్డులు
2011 భూ అధీకృత సాగుదార్ల చట్టం ప్రకారం కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు ఈ కాలంలో ఒక్క శాతం మందికి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. అందువల్ల కౌలు రైతులకు పరిహారం దక్కదు. అంతేగాక మార్క్ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు లేకపోవడంతో మొత్తం పంటను వ్యాపారులే కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకొన్న వ్యాపారులు సిండికేట్ అయ్యి వారి ఇష్టారాజ్యంగా కొంటు న్నారు. రైతుకు గిట్టుబాటు అయ్యే ధర నిర్ణయించి మార్క్ఫెడ్ ద్వారా కొంత మిర్చిని కొనుగోలు చేస్తే ధరలు పెరిగే అవకాశం ఉండేది. ప్రభుత్వం ఆ పనిచేయకుండా చేతులెత్తేసింది. దీంతో ఈ పరిస్థితి వ్యాపారులకు కలిసొచ్చింది.
అంతా అయిపోయాక స్పందిస్తారా?
ఇప్పటికే రైతులు తమ వద్ద ఉన్న పంటని 80 శాతం పైగా విక్రయించేశారు. మూడో కోతలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో పంట విక్రయించి నష్టపోయిన రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 20 క్వింటాళ్ల వరకు మాత్రమే అదనపు ధర చెల్లిస్తామని సీలింగ్ పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మార్క్ఫెడ్ ద్వారా క్వింటాలు మిర్చిని రూ.10 వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మిర్చికి గత ఏడాది మార్కెట్ ధర చూసి రైతులు ఎంతో ఆశతో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడమే వారి కొంప ముంచిందన్న విమర్శలు ఉన్నాయి.
రూ.12 వేల నుంచి రూ.6000కు తగ్గిన ధర
నిరుడు మహారాష్ట్ర, మధ్యప్రదేశ వంటి రాష్ట్రాల్లో తెగుళ్లు, వర్షాభావం, తుపాన్ల కారణంగా మిర్చి పంట బాగా నష్టపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మిర్చికి మంచి డిమాండ్ వచ్చింది. గత ఏడాది వ్యాపారులు క్వింటాలు రూ.12,000 నుంచి రూ.18,000 వరకు ధర పెట్టి కొనుగోలు చేశారు. దాంతో ఈ ఏడాది చాలా మంది రైతులు మిర్చి సాగు చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రమారమీ 1.17 లక్షల మంది రైతులు అధికంగా మిర్చి సాగు చేశారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,90,170 ఎకరాల్లో మిర్చి సాగైతే.. ఈ సంవత్సరం 4,64,952 ఎకరాల్లో రైతులు పంట వేశారు. 92,99,050 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కానీ ఇరుగు పొరుగు దేశాల్లో డిమాండ్ తగ్గిందని పేర్కొంటూ నాణ్యమైన మిర్చి ధర రూ.6000కు వ్యాపారులు తగ్గించేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఇదీ పొరుగుదేశాల్లో పరిస్థితి
పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ, మయన్మార్ వంటి దేశాల్లో కూడా పంట దిగుబడి బాగుండడంతో ఎగుమతులు పడిపోయిందన్న సాకుతో వ్యాపారులు ధర తగ్గించేశారు. దేశవాళీ రకాలకు మార్కెట్లో క్వింటాలుకు రూ.4 వేలకు మించి ధర లభించడం లేదు. తేజ వంటి సూపర్క్వాలిటీ రకాలకు రూ.6 వేల వరకు వస్తున్నా రైతుకు గిట్టుబాటు కావడం లేదు. పెట్టుబడి వ్యయంలో ఎకరానికి రూ.40 వేల వరకు నష్టపోయే పరిస్థితి రావడంతో గుంటూరు, కర్నూలు వంటి జిల్లాల్లో రైతులు పొలంలోనే పంటను వదిలేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో మిర్చిని రోడ్డుపై పోసి నిప్పంటించారు.