చెమటలు కక్కుతున్న జగన్ క్యాంప్
ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారం గతంలో ఎపిఐఐసి చైర్మన్ గా అంబటి రాంబాబు ఉన్నప్పుడు చోటు చేసుకుంది. ఇది పది వేల కోట్ల రూపాయల కుంభకోణమని అధికార కాంగ్రెసు పార్టీ నాయకులే అంటున్నారు. సీనియర్ శాసనసభ్యులు డిఎల్ రవీంద్రా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి ఈ వ్యవహారంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తాజాగా, సీనియర్ కాంగ్రెసు నాయకుడు వి హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు. ఆ వ్యవహారం వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరో తేలాలని ఆయన అంటున్నారు. ఎపిఐఐసిని ముంచుతూ కోట్ల రూపాయల విలువ చేసే భూములను కట్టబెట్టిన వైనం అంబటి రాంబాబు హయాంలో జరిగిందనేది అందరూ ఎరిగిన సత్యమే. దీనిపై సమాధానం చెప్పలేని ఇరకాటంలో రాంబాబు పడ్డారు.
ఇక, కడప మేయర్, వైయస్సార్ బావ మరిది రవీంద్రనాథ్ రెడ్డి పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంది. ఎరువుల అక్రమ రవాణా నుంచి మొదలు పెడితే రవీంద్రనాథ్ రెడ్డికి చెందిన హరిత, తదితర సంస్థలకు నిబంధనలను ఉల్లంఘించి ఎరువులు కేటాయించిన వైనం వెలుగు చూసింది. రవీంద్రనాథ్ రెడ్డి వచ్చిన ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆందోళనలకు కూడా దిగాయి. రవీంద్రనాథ్ రెడ్డి వ్యవహారంపై తుది దాకా పోరాడుతామని రైతు సంఘాలు అంటున్నాయి. రైతులు తీవ్రమైన ఎరువుల కొరతను ఎదుర్కుంటున్న సమయంలో రవీంద్రనాథ్ రెడ్డి ఎరువుల అక్రమ రవాణా వ్యవహారం వైయస్ జగన్ ను కూడా ఇరకాటంలో పడేసింది.
కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ గా వెలగబెట్టిన భూమన కరుణాకర్ రెడ్డిపై కూడా తీవ్రమైన ఆరోపణలే వచ్చాయి. టిటిడి పాలక మండలి అవకతవకలపై తీవ్ర వివాదం చెలరేగింది. తనపై వచ్చిన ఆరోపణల మీద సిబిఐ విచారణ జరిపించాలని కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ దీక్ష పెద్దగా ఫలితం ఇవ్వలేదు. ఇకపోతే మిగిలింది, శాయంపేట శాసనసభ్యురాలు కొండా సురేఖ. ఆమెపై ఇప్పటి వరకు ఆరోపణలు రాలేదు. మిగతావారి అంతు తేలిస్తే సురేఖను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నారేమో, తెలియదు. ఏమైనా, ఇవన్నీ వైయస్ జగన్ భవిష్యత్తు రాజకీయ జీవితంపై ప్రభావం చూపే అవకాశమే ఉంది.