యుపి ఫలితాలు వైయస్ జగన్‌కు బూస్ట్

YS Jagan
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చరిష్మా పని చేయలేదని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఈ ఫలితాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా ఓ అవగాహనకు రావచ్చు. కాంగ్రెసు పార్టీతో ప్రజలు విసిగిపోయారనేది అర్థమవుతోంది. అన్నా హజారే కావచ్చు, వైయస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, కాంగ్రెసు వేధింపు రాజకీయాలకు పాల్పడుతోందనేది తెలిసిపోతోంది. కాంగ్రెసు అత్యంత బలహీనమైన స్థితికి చేరుకుంది. ఇప్పటికిప్పుడు లోకసభ ఎన్నికలు జరిగితే లోకసభలో కాంగ్రెసుకు వంద సీట్లు కూడా వచ్చే స్థితి లేదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెసు స్థితి అత్యంత దయనీయంగా ఉంటుంది. బీహార్ ఓటమి తర్వాత యుపి కాంగ్రెసుకు గుణపాఠం. దేశవ్యాప్తంగా కాంగ్రెసు పునాదులు కోల్పోతోంది. ప్రధాన రాష్ట్రాల్లో ఎక్కడా కాంగ్రెసు గెలిచే స్థితి లేదు.

వైయస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసును రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన తర్వాత ఇప్పుడు దయనీయమైన స్థితిని ఎదుర్కుంటోంది. అమేథీ, రాయబరేలీల్లోని పది సీట్లలో ఎనిమిది సీట్లలో ఓడిపోవడం కాంగ్రెసుకు ఎదురులేని దెబ్బ. ఇది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌‌లో విశ్వాసాన్ని పెంచుతుంది. జగన్‌కు, వైయస్సార్ కాంగ్రెసుకు, ఆ పార్టీ కార్యకర్తలకు ఉత్సాహాన్నిచ్చే అంశం. అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ చేసిన పనే వైయస్ జగన్, వైయస్సార్ ఎందుకు చేయరనేది ప్రశ్న. యుపిలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు బలహీనంగా ఉంది. యుపిలో మాయావతి బిఎస్పీ కన్నా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. యుపిలో సైకిల్ దూసుకుపోవచ్చు గానీ ఇక్కడ దానికి అంత సీన్ లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ వల్లనే కాంగ్రెసు రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని, సోనియా గాంధీకి గానీ రాహుల్ గాంధీకి గానీ కాంగ్రెసు పార్టీకి గానీ ఏ సంబంధమూ లేదని ప్రస్తుత ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. వైయస్సార్ చరిష్మాతో వాళ్లు లాభపడి కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. కాంగ్రెసు పార్టీ వైయస్సార్ సేవలను గుర్తించడానికి బదులు విహెచ్, కెకె వంటి నాయకులతో వైయస్సార్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై బురద చల్లిస్తోంది.

ప్రస్తుత పరిస్థితిలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు అవకాశాలున్నాయి. 2014కు ముందే ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ములాయం గానీ మమతా బెనర్జీ గానీ ప్రధాని అయి సమర్థమైన పాలనను అందించడానికి వీలుంది. మాయావతి కూడా ఈ కూటమిలో భాగస్వామి అయితే ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా మూడో కూటమి స్వీప్ చేస్తుంది. కాంగ్రెసు, బిజెపిలతో విసిగిపోయినందున మూడో కూటమి ప్రత్యామ్నాయంగా ప్రజల విశ్వాసం పొందుతుంది. జాతీయ రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న మమతా బెనర్జీ, ములాయం సింగ్ ఆ పని సులభంగా చేయగలరు. ఈ ప్రయత్నాలు మూడో కూటమి ద్వారా పాత సోషలిస్టులు ఏకం కావడానికి పనికి వస్తుంది.

కమ్యూనిస్టు, మార్క్సిస్టు పార్టీలతో కలిసి మూలాయం (యుపి - 80), జయలలిత (తమిళనాడు - 39), జగన్ (ఎపి - 42), నవీన్ (ఒరిస్సా - 21), నితీష్ (బీహార్ - 40) మూడో కూటమి భాగస్వాములు అవుతారు. ఎన్నికలకు ముందు మూడో కూటమి ఉమ్మడి ఎజెండాను, ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలి. దానికి తర్వాత కట్టుబడి పనిచేయాలి. దేశంలో మూడో కూటమి ఏర్పాటుకు ఇది సరైన సమయం.

- గురువారెడ్డి, అట్లాంటా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+