పవన్ కళ్యాణ్ కన్ను: కెసిఆర్ బల్దియా ప్లాన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మజ్లీస్తో స్నేహం చేయడం వెనక తక్షణ ప్రయోజనాలే కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికలపై దృష్టి పెడుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనడంతో అందరి దృష్టి అటు పడింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ అత్యంత కీలకమైంది. హైదరాబాదుపై పట్టు బిగించాలని సీమాంధ్ర రాజకీయ నాయకులు భావిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీమాంధ్ర ఓటర్లు అధికంగా ఉండడంతో తెలుగుదేశం, బిజెపిలు అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాయి.
టిడిపి, బిజెపిలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ స్థానాల్లో 14 స్థానాలను గెలుచుకున్నాయి. ఈ రెండు పార్టీలకు తెంలగాణలో మొత్తంగా వచ్చినవి 20 స్థానాలే. దీన్నిబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ పార్టీల పట్టు కనిపిస్తోంది. ఎన్నికలు జరిగితే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి)ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇది తెలంగాణకు సంబంధించినంత వరకే కాకుండా తన పార్టీకి కూడా సవాల్ వంటిదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు భావిస్తున్నారు.
జిహెచ్ఎంసిలో మొత్తం 150 స్థానాలున్నాయి. 2009 నవంబర్లో దానికి ఎన్నికలు జరిగాయి. 150 స్థానాల్లో మజ్లీస్ 43, కాంగ్రెసు 52, టిడిపి 45, బిజెపి ఐదు స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో కాంగ్రెసు, మజ్లీస్ కలిసి బల్దియా అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఈ లెక్కన బిజెపి, టిడిపి కలిస్తే తనకు ప్రమాదకరమని కెసిఆర్ భావించి ఉంటారు. దీంతో ఆయన ముందు చూపుతో మజ్లీస్తో దోస్తీ కట్టినట్లు తెలుస్తోంది. ఇదే కోణంలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆలోచిస్తూ ఉండవచ్చు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెసు నామమాత్రంగా మారింది. బల్దియా ఎన్నికలు వస్తే మజ్లీస్తో కలిస్తేనే మనుగడ ఉంటుందనే భావనతో కెసిఆర్ ఉన్నట్లు భావించవచ్చు. టిడిపి, బిజెపి జెండా నగరపాలక సంస్థపై ఎగురకూడదంటే అది కెసిఆర్కు అవసరంగా మారింది.