'సిల్లి'గా నడిపించిందెవరు: వారి గైర్హాజరీ వెనుక..?
ఇలాంటి కీలక సమయంలో దేవేందర్, సుధారాణి, సుజనా చౌదరిలో బాబుపై కోలుకోలేని దెబ్బ వేశారు. వారు చేసిన పనికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి విమర్శలు ఏమో కానీ సొంత పార్టీ నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్, కొత్తకోట దయాకర్ రెడ్డి, యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతలు అందరూ ఆ ముగ్గురిపై మూకుమ్మడి దాడి చేశారు. వారిని ఉపేక్షించవద్దని అధినేతకు సూచిస్తున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత తెలంగాణలో సెంటిమెంట్, సీమాంధ్రలో జగన్ కారణంగా పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఓ సమయంలో అసలు పార్టీ కనుమరుగవుతుందా అనేలా కనిపించింది. అలాంటి స్థితి నుండి ఇప్పుడు మళ్లీ 2014లో అధికారంలోకి తప్పకుండా వస్తామనే నూతనోత్సాహం టిడిపిలో కనిపిస్తోంది. పార్టీలో ఊపు తీసుకు వచ్చేందుకు బాబు చేయని ప్రయత్నాలు లేవు. అందులో భాగంగా ఆయన 63 ఏళ్ల వయస్సులోనూ భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
అటు జగన్ ఇటు తెలంగాణ సెంటిమెంట్ నుండి ప్రజలు క్రమంగా బయటపడుతున్నారు. టిడిపికి తిరిగి గతంలో వలే ఆదరణ కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు నారా - నందమూరి కుటుంబాలు ఒక్కతాటి పైకి రావడం పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపింది. కాంగ్రెసు పార్టీ పాలనను దుమ్మెత్తి పోస్తూనే వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిని ధీటుగా ఎదుర్కొంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆ ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీ పైన పెద్ద గుది బండ వేశారు. గైర్హాజరు కావడం వల్ల వారు టిడిపి ప్రతిష్టను, బాబు ప్రతిష్టను మసకబార్చారని అంటున్నారు. వారిపై వేటు వేస్తేనే పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటున్నారు. వారిని సస్పెండ్ చేయాలని పార్టీ సీనియర్లు, పలువురు నేతలు చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు దీనిపై సమాలోచనలు జరిపి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పార్టీ ప్రతిష్ట మసకబారకూడదంటే నమ్మి పదవులు కట్టబెడితే నట్టేట ముంచిన అలాంటి వారిపై వేటు తప్ప మరో మార్గం లేదంటున్నారు.
సభకు గైర్హాజరీ కావడంపై దేవేందర్, సుధారాణి, సుజనా చౌదరిలు చెబుతున్న కారణాలు చాలా సిల్లీగా ఉన్నాయి. తన బంధువులు చనిపోయారని, ఫ్లైట్ అందలేని సుధారాని చెబితే, బిఎస్పీ ప్రకటనతో లైట్గా తీసుకున్నామని, డాక్టరు వద్దకెళ్లామని, జలుబు చేసిందని సుజనా చౌదరి, దేవేందర్లు చెబుతున్నారు. వారు చెప్పే కారణాలకు టిడిపి నేతలే కాదు. ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు.
అయితే వీరి గైర్హాజరీ వెనుక సుజనా చౌదరి ఉండి ఉంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయనే వెనుక ఉండి నడిపించి ఉంటారని అంటున్నారు. అయితే చౌదరి బిజినెస్మన్ కాబట్టి ఏదైనా ఆలోచిస్తారని కానీ దేవేందర్ గౌడ్, గుండు సుధారాణీలు గుడ్డిగా అతనిని ఎందుకు ఫాలో అయ్యారో అర్థం కాలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.