భళారే: ఈ యేటి యాహూ మేటి వ్యక్తి ఆవు
న్యూఢిల్లీ: యాహూ ఈ యేటి మేటి వ్యక్తిగా ఆవు ఎంపికైంది. ఈ సంస్థ సోమవారం ఓ ప్రకటనలో ఈ విషయం చెప్పింది. నెంబర్ వన్ స్థానానికి బడాబాబులు చాలా మంది పోటీ పడగా గోమాత క్రమక్రమంగా పైకి ఎగబాకుతూ వచ్చింది.
మహారాష్ట్ర ప్రభుత్వం బీఫ్పై నిషేధం విధించడంతో ఆవు ప్రముఖంగా తెర మీదికి వచ్చింది. గోమాతపై ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ చర్చల జోరు ఊపందుకుంది. ఆ తర్వాత దాద్రీలో జరిగిన దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు పోవడంతో అసహన చర్చలకు గోమాత కేంద్ర బిందువుగా మారింది.
అవార్డు వాపసీకి దారి తీసింది. ఒక దశలో అవు కారణంగా పార్లమెంటు సమావేశాలు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. పలు వివాదాల కారణంగా గోమాత పైపైకి ఎగబాకుతూ వచ్చింది. కేజ్రీవాల్, నితీష్ కుమార్ కూడా హల్చల్ చేశారు. నరేంద్ర మోడీ ముందుకు సాగడానికి ప్రయత్నించారు. వారు వార్తల్లోని వ్యక్తులుగా నిలిచారు.
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్, వరల్డ్ కప్ హంగామా, అబ్దుల్ కలామ్ మృతి, షీనా బోరా హత్య, వ్యాపం కుంభకోణం వంటివి ప్రజలు వెతికిన కథనాల్లో అగ్రభాగాన నిలిచాయి. కాగా, సన్నీ లియోన్ వరుసగా నాలుగో యేట అత్యధికులు గాలించిన సెలిబ్రీటీ స్థానాన్ని దక్కించుకుంది. పురుషుల్లో సల్మాన్ ఖాన్ టాపర్గా నిలిచాడు. అత్యధికులు సెర్చ్ చేసిన స్పోర్ట్స్ పర్సన్గా ఎంఎస్ ధోనీ నిలిచాడు.