రోడ్డు పక్కనే బట్టలు మార్చుకున్న గవర్నర్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్గా కొనసాగుతున్న నరసింహాన్ రోడ్డు పక్కనే ఓ ఆలయం వద్ద తన కాన్వాయ్ని ఆపించి దుస్తులు మార్చుకున్నారు. వివరాల్లోకి వెళితే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి రాత్రి 8:30 గంటలకు సతీసమేతంగా యాదాద్రికి వచ్చారు.
అయితే సతీ సమేతంగా లక్ష్మీనరసింహుడి కల్యాణ వేడుక హాజరైన గవర్నర్ మధ్యలోనే వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కల్యాణం జరిగే మండపంలో ఆశీనులై పెళ్లి తంతును తిలకించారు. అయితే, ముహూర్తం ప్రకారం స్వామి వారి ఉరేగింపు 9:45 గంటలకు కల్యాణ మండపానికి రావాల్సి ఉంది.
కానీ 18 నిమిషాలు ఆలస్యంగా 10:03 నిమిషాలకు వచ్చింది. దీంతో గవర్నర్ నరసింహన్ ఆలయ ఈవో గీతారెడ్డిని ఆలస్యం ఎందుకు అయిందని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీనికి ఆమె కొందరు రాజకీయ ప్రజాప్రతినిధులు ఇంకా రాకపోవడం వల్ల కార్యక్రమాన్ని ఆలస్యంగా నడిపిస్తున్నట్లు సమాధానం వచ్చింది.
దీంతో ఆయన ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇష్ట ప్రకారం చేయడానికి ఎవరింట్లో పెళ్లనుకుంటున్నారు? అన్నీ సమయం ప్రకారం ఎందుకు జరపడం లేదు? అని ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో ఈవో గీత వెంటనే పూజాది కార్యక్రమాలను ప్రారంభించాలని అర్చకులకు సూచించారని తెలుస్తోంది.
ఆ తర్వాత కాసేపు అసహనంగానే అక్కడ గడిపిన గవర్నర్ కల్యాణంలో మాంగల్యధారణ ఘట్టం కాకముందే 10:45 గంటల సమయంలో అక్కడినుంచి శ్రీమతితో కలిసి వెళ్లిపోయారు. కల్యాణానికి సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఆయన అలాగే ఆ దుస్తులైనా మార్చుకోకుండా వెళ్లి కారులో కూర్చుని హైదరాబాదు బయల్దేరేశారు.
మార్గమధ్యంలో రాయగిరి కట్టమీద ఉన్న మైసమ్మ దేవాలయం వద్ద తన వాహనాన్ని ఆపి, గవర్నర్ అక్కడ దుస్తులు మార్చుకుని వెళ్లారుట. గవర్నర్ వెళ్లిన తర్వాత 40 నిమిషాలకు అంటే 11: 25 నిమిషాలకు స్వామి వారి కల్యాణ ఘట్టం ముగియడం గమనార్హం.
ఇంతకీ గవర్నర్కు ఆగ్రహం తెప్పించేలా.. స్వామివారి కల్యాణం లేటుగా జరిగేందుకు కారకులైన రాజకీయ నాయకులు ఎవరా అని ఆరా తీస్తే.. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి, ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ హాజరు కావాల్సి ఉంది. ఈ నలుగురిలో ఎవరు ఆలస్యంగా వచ్చారో తెలియరాలేదు.