భర్తలకు తెలిసే వేశ్యవృత్తిలోకి, 40% సంపాదన దళారులకే: జయమాల కమిటీ
భర్తలకు తెలిసే ఇంట్లోనే వ్యభిచారం చేసే మహిళల సంఖ్య కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా ఉందని జయమాల కమిటీ గుర్తించింది. సెక్స్వర్కర్లపై ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేసింది.
బెంగుళూరు: భర్తలకు తెలిసే ఇంట్లోనే వ్యభిచారం చేసే మహిళల సంఖ్య కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా ఉందని జయమాల కమిటీ గుర్తించింది. సెక్స్వర్కర్లపై ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేసింది.ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
సెక్స్వర్కర్లు మెరుగైన జీవనాన్ని కోరుకొంటున్నారు. అయితే వారికి ఆశించిమేర ఆదాయం అందడంలేదని తేలింది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే బెంగుళూరు నగరంలో వేశ్యవృత్తిని నిర్వహించే మహిళలు తమ భర్తలకు తెలిసే ఈ వృత్తిలో కొనసాగుతున్నారు.
ఇతర ప్రాంతాలకు వెళ్ళకుండా తమ ఇళ్ళలోనే వేశ్యవృత్తిని కొనసాగిస్తున్నారు. ఏడాదిపాటు జయమాల కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఈ మేరకు అధ్యయనం చేయడంతో ఈ విషయాలు వెలుగుచూశాయి.
ప్రభుత్వంతోపాటు స్వచ్చంధసంస్థల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేసింది. సెక్స్ వర్కర్ల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకుగాను తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి ఆ కమిటీ పలు సూచనలను చేసింది.
కుటుంబసభ్యులే వేశ్యలుగా మార్చుతున్నారు
పేదరికం, కుటుంబ పెద్దల అనారోగ్యం తదితర కారణాలతో మహిళలు వేశ్యవృత్తిని ఎంచుకొంటున్న ఘటనలు కూడ అనేకంగా ఈ కమిటీ దృష్టికి వచ్చాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భర్తలు స్వయంగా మహిళలను ఈ వృత్తిలోకి దించిన ఘటనలు కూడ ఉన్నాయని కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. వివాహం చేసుకొన్న మహిళలే ఎక్కువగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. అయితే ఈ వృత్తిలోకి వచ్చినవారు ఆయా కుటుంబాలకున్న సామాజిక పరిస్థితులను కారణంగా చూపుతున్నారు.
బెళగావి జిల్లానుండే 18 ఏళ్ళ కంటే తక్కువ వయస్సున్నవారే
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లా నుండి ఎక్కువగా వేశ్యవృత్తిలో కొనసాగుతున్నవారు ఉన్నట్టు ఈ కమిటీ నివేదిక తేల్చింది. అయితే 18 ఏళ్ళ వయస్సుకంటే తక్కువ వయస్సున్నవారు కూడ ఈ వృత్తిలో కొనసాగుతున్నవారు కూడ ఈ జిల్లానుండే ఎక్కువగా ఉన్నారు. ఈ జిల్లా నుండి 240 మంది 18 ఏళ్ళలోపు వయస్సున్నవారు ఈ వృత్తిలో కొనసాగుతున్నారని కమిటీ తేల్చింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇంత తక్కువ వయస్సు గలవారు ఈ వృత్తిలో కొనసాగుతోంది 459మంది. బెళగావి తర్వాత ధార్వాడ, విజయపుర జిల్లాలున్నాయి.
వివాహితులే ఎక్కువమంది వేశ్యవృత్తిలో
వేశ్యవృత్తిలోకి ఎక్కువగా వివాహమైనవారే ఉన్నారని కమిటీ నివేదిక తేల్చింది. రాష్ట్రంలో 1,00,676 మంది సెక్స్ వర్కర్లున్నారు. వివాహితులు 38.4 శాతం మంది ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. 6శాతం మంది అవివాహితులు, 10.8 శాతం మంది విడాకులు తీసుకొన్నవారు, 19.3 వాతం మంది వితంతువులు, 2.1 శాతం సహజీవనంలో ఉన్నవారు. 2.2 శాతం మంది రెండోభర్తతో ఉన్నవారు ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. 0.8 శాతం మంది రెండు కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకొన్నవారు మిగిలిన 20.4 శాతం మంది పెళ్ళి సంబంధ విషయాలను వెల్లడించేందుకు ఇష్టపడలేదు.
40 శాతం సొమ్ము దళారులకు
వేశ్యవృత్తిలో ఉన్నవారు తాము సంపాదించినవారిలో 40 శాతం మంది దళారులకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. బ్రోకర్లు, రౌడీలు, గుండాలతో పాటు, పోలీసులకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని ఈ కమిటీ నివేదిక తేల్చింది. ఈ వృత్తిలో కొనసాగుతున్న మహిళల్లో సుమారు 8 వేల మంది ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డారు. వృద్దులు కొందరు తమ ఇళ్ళను వేశ్యలకు అద్దెకు ఇస్తూ గంటకు కొంత సొమ్మును వసూలు చేస్తున్నారు. డబ్బులకు బదులుగా సరుకులు, లేదా వస్తువులను కూడ తీసుకొంటున్న ఘటనలు కూడ ఉన్నాయి. మొక్కజొన్న, జొన్న వంటివి కూడ ఉన్నాయి. గ్రామ జాతరలు సాగే సమయంలో కూడ సెక్స్ వర్కర్లుగా మారే ఘటనలు కూడ అనేకం ఉన్నాయి.
సెక్స్వర్కర్లకు ప్రభుత్వం చేయూత ఇలా
రాష్ట్రంలోని సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం రూ.733 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. 45 ఏళ్ళు దాటినవారికి అంత్యోదయ కార్డుతో పాటు రూ.5 వేలను ప్రతినెలా ఇవ్వాలి. హెచ్ఐవితో బాధపడేవారికి ఉచితంగా మందులను అందించడంతోపాటు రూ.5 వేల సహయం ఇవ్వాలి.ఈ వృత్తినుండి బయటపడాలనుకొనేవారికి ప్రతిరోజూ రూ.300 చెల్లిస్తూ వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని కమిటీ నివేదిక ఇచ్చింది.