గుత్తా 'షాక్'కు ముందే కెసిఆర్ వ్యూహం, కోమటిరెడ్డి బ్రదర్స్ నిలుస్తారా?
నల్గొండ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డితో రాజీనామా చేయించి, సీఎం కెసిఆర్ స్వీయ పరీక్షకు సిద్ధమవుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే చర్చ సాగుతోంది.
హైదరాబాద్: నల్గొండ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డితో రాజీనామా చేయించి, సీఎం కెసిఆర్ స్వీయ పరీక్షకు సిద్ధమవుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే చర్చ సాగుతోంది.
షాక్ తగలడానికి ముందే..
గుత్తా కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్లో చేరారు. ఇటీవల కేసీఆర్ ఢిల్లీలో కంటి పరీక్ష చేయించుకున్నారు. లోకసభలో గుత్తా అనర్హత ఫైలు కదులుతున్నదనే సమాచారం కెసిఆర్కు తెలిసిందని సమాచారం. దీంతో తమకు షాక్ తగలడానికి ముందే రాజీనామా చేయించి, స్వీయ పరీక్షకు వెళ్తే ఒక్క దెబ్బకు.. అన్న చందంగా తనకు లాభిస్తుందని భావిస్తున్నారని సమాచారం.
గుత్తా ఆశలు
గుత్తా మంత్రి కావాలనుకుంటున్నారు. ఇదే సమయంలో రాజీనామా చేయిస్తే, ఆయన కోరిక నెరవేరుతుంది, ఉప ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్షాలకు తమ సత్తా తెలిపినట్లవుతుంది, ఇక లోకసభలో రాజీనామాపై తమకు షాక్ తగలకుండా ఉంటుందని కెసిఆర్ భావిస్తున్నారని సమాచారం. గుత్తాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా చేసి, కేబినెట్ హోదా ఇచ్చే అవకాశముంది.
పోటీ పెడితే.. కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ చేస్తారా?
నల్గొండలో కోమటిరెడ్డి సోదరులకు మంచి బలం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి సోదరులు పోటీ చేసే అవకాశముందా అనే చర్చ సాగుతోంది. వారు పిసిసి అధ్యక్ష పదవి కోసం పట్టుబడుతున్నారు. ఆ పదవి ఇస్తేనే వారు పోటీ చేయవచ్చునని అంటున్నారు.
టీఆర్ఎస్లోకి జంప్ చేసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదు
కోమటిరెడ్డి సోదరులకు టిఆర్ఎస్ ముఖ్య నేతలు టచ్లో ఉన్నారని తెలుస్తోంది. పిసిసి చీఫ్ పదవి దక్కకుంటే, కెసిఆర్ వీరిని బరిలోకి దించేందుకు సిద్ధపడితే వారు తెరాసలో చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. లేదంటే పిసిసి చీఫ్ పదవి ఇస్తే వారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా కొట్టి పారేయలేమంటున్నారు.
గుత్తా పావులుు
రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి దిశగా లోకసభ సభ్యుడు గుత్తా కదుపుతున్నారు. పక్కా వ్యూహంతో క్షేత్రస్థాయి నుంచి ఇందుకు రాజకీయ బాట వేసుకుంటున్నారు. ఉరుమడ్లలో ఆయనకు పొలాలున్నాయి. తాజాగా ఖరారైన ఈ గ్రామ రైతు సమన్వయ సమితిలో గుత్తాకు చోటు దక్కింది. ఈ మండలంలోని అన్ని గ్రామ సమితుల సభ్యుల్లోంచి 24 మందితో మండల సమితిని ఖరారు చేశారు. ఇందులోనూ ఆయన పేరు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత మండల సమితుల సభ్యుల్లో నుంచి 24 మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అందులోను గుత్తా పేరు ఉందని సమాచారం. అధ్యక్ష పదవి రానున్నందునే ఆయన పేరు ఖరారు చేస్తున్నారని అంటున్నారు.