అంకెల కనికట్టు: కేశవ్
హైదరాబాద్: బడ్జెట్ అంచనా వ్యయం 2003 కోట్లు మాత్రమే పెంచారని, ఆహారధాన్యాల ఉత్పత్తి గత సంవత్సరం ఎంతో తగ్గిన మాటే లేదని తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. వచ్చే ఏడాది అంచనాలు మాత్రం ఘనంగా చెప్పారని, అంకెల కనికట్టు అని ఆయన విమర్శించారు. గత ఏడాది పెరిగిన అప్పుల సంగతి దాచారని అన్నారు. బడ్జెట్లో వ్యవసాయం, నీటిపారుదలకు కేటాయింపులు తగ్గాయని, అసమర్థ పాలనకు ఈ బడ్జెట్ నిదర్శనమని విమర్శించారు.
అంకెల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నమే ఈ బడ్జెట్ అని తెలంగాణ రాష్ట్ర సమితి శాససనభ పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. భూములను అమ్మి ఆదాయం పెంచాలని ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు. ఇందిరాక్రాంతి కింద ప్రకటించిన పది పథకాల్లో ఈ బడ్జెట్లో రెండు పథకాల గురించే ప్రస్తావించారని, మిగిలినవాటి గురించే మర్చిపోయారని అన్నారు.
బడ్జెట్ ఎన్నికల కరపత్రంలా ఉందని సిపిఎం శాససనభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య అభిప్రాయపడ్డారు. రోశయ్య ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో కోనేరు రంగారావు సిఫార్సులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. భూసంస్కరణల మాటే ఎత్తలేదని, ఈ ఓటాన్ అకౌంట్ కాంగ్రెస్ను ఏవిధంగానూ నిలబెట్టలేదని ఆయన అన్నారు. సంక్షేమానికి పెద్ద ఎత్తున కోత విధించారని, ప్రజలు కూడా ప్రభుత్వానికి కోత పెట్టే సమయం వచ్చిందని, దాన్ని పెద్దలు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.
అరచేతిలో స్వర్గం చూపుతున్నారు తప్ప, ప్రయోజనం లేని బడ్జెట్ గా సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు చాడ వెంకట రెడ్డి అభివర్ణించారు. మళ్లీ అధికారంలోకి రావడానికి బడ్జెట్లో అబద్ధాలను ప్రచారం చేశారని, పంట రుణాలు, పావలా వడ్డీ అమలు కావడమే లేదని, ఆయన అన్నారు. ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆయన అన్నారు. ఉచిత విద్యుత్తు వల్ల కాలిపోయిన కరెంటు మోటార్లు, విద్యుత్తు షాక్తో చనిపోయిన రైతులకు ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications