బెజవాడ కమిషనర్ పై జర్నలిస్టుల గరం
ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిఫార్సులను గౌరవించి విజయవాడ సీపీ పీఎస్ఆర్ ఆంజనేయులను తక్షణమే బదిలీ చేయాలని కోరుతూ బుధవారం స్థానిక సాంబమూర్తి రోడ్డులోని ప్రెస్క్లబ్ వద్ద యూనియన్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో మీడియా ప్రతినిధులపై దాడికి కారకులైన నలుగురు అధికారుల్లో ఆంజనేయులు ఒకరని ప్రెస్ కౌన్సిల్ నిర్ధారించినట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో యూనియన్ ఆందోళనలు నిర్వహిస్తోందని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని, ప్రెస్కౌన్సిల్ సిఫార్సులు అమలయ్యే వరకూ ఆందోళనలు కొనసాగుతాయన్నారు. శిబిరంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, కృష్ణా అర్బన్ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు ముత్యాల ప్రసాద్, చావా రవి, ప్రెస్క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే బాబు, అన్నవరపు బ్రహ్మయ్య, యూనియన్ ఉపాధ్యక్షుడు దారం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
శిబిరాన్ని సందర్శించిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే యలమంచిలి రవి, సమతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు వీవీ కృష్ణారావు, సీపీఎం నగర కార్యదర్శి ఆర్ రఘు, ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు రెహమాన్, పలు సంఘాల నేతలు యూనియన్ నాయకులను పరామర్శించి తమ సంఘీభావం తెలిపారు. ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినాదాలు చేశారు.