న్యాయం జరగనందునే సమావేశాలు బహిష్కరిస్తున్నాం: టిఆర్ఎస్
నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణపై ప్రత్యేక తీర్మానం పెట్టిన తర్వాతే మరేదైనా పని చేయాలన్నారు. ఈ శాసనసభలో మాకు న్యాయం జరగదని తెలిసి బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నామని చెప్పారు. ఇంటర్ పరీక్షలను ఈ నెల 7వ తారీఖునుండి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం విడ్డూరమన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవడానికే ప్రభుత్వం పరీక్షలు ప్రారంభిస్తుందన్నారు. చలో హైదరాబాద్కు ఎలాంటి అనుమతి అవసరం లేదని మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. మార్చి 10న ప్రజలంతా రోడ్లపైనే వంటలు పెడతారన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు సతీమణి కూడా రోడ్డుపైనే వంట చేస్తుందని అన్నారు. ఈ శాసనసభలో మా మొర విననందుకే బహిష్కరిస్తున్నామని చెప్పారు. చిదంబరం మాటలను నాయిని ఖండించారు.
కేంద్ర మంత్రి మతి లేని మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సంవత్సరం క్రితం ఆయనే తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు చెప్పి ఇప్పుడు రాత్రికి రాత్రే రాదని చెప్పడం విడ్డూరమన్నారు. ఆయన స్వయంగా చేసిన ప్రకటన ఆయన మర్చిపోయినా తెలంగాణ ప్రజలు మర్చి పోలేదన్నారు. ఆయన వెంటనే తన మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. పుట్టినరోజులు, పెళ్లి పార్టీలు కూడా రోడ్డుపైనే చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.