చంద్రబాబుకు తలనొప్పి, బైరెడ్డి రాయలసీమ చిచ్చు
తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ రాయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, చంద్రబాబు ఆలోచన తమకు మానసిక క్షోభ కలిగిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే రాయలసీమ పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు.
రాయలసీమ పరిస్థితిపై అన్ని పార్టీలకు లేఖ రాస్తామని, ఆ లేఖను విస్మరిస్తే నాయకులు గానీ పార్టీలు గానీ ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. రాయలసీమలో నామమాత్రంగానే కార్పోరేషన్లు ఉన్నాయని, అవన్నీ పల్లెలు మాత్రమేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే రాయలసీమ విషయాన్ని కూడా తేల్చాలని తాము కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కూడా లేఖలు రాస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటువుతుందనే నమ్మకం అందరిలో ఏర్పడిందని, తాజా పరిస్థితి చూస్తుంటే తెలంగాణ వచ్చేట్లుందని ఆయన అన్నారు. రాయలసీమ నేతలకు పార్టీలు, పదవులు గోటితో సమానమని, తమకు తమ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు. ఈ నెల 26వ తేదీన రాయలసీమవాసులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశం 11 ఏళ్ల నుంచి మాత్రమే ఉంటే రాయలసీమ అంశం 1934 నుంచి ఉందని ఆయన చెప్పారు. రాయలసీమ సుడిగుండంలో చిక్కుకుందని ఆయన అన్నారు.