లాహోర్లోని చౌరస్తాకు భగత్సింగ్ పేరు, విగ్రహ స్థాపన
చౌరస్తాకు భగత్ పేరు పెట్టడం, విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అన్ని మతాలకు, అందరు ఉద్యమకారులకు చెందిన విజయంగా ఏళ్లుగా దీని కోసం ఉద్యమిస్తున్న ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ అండ్ సెక్యులర్ స్టడీస్ చెప్పిందని డెయిలీ టైమ్స్ అనే పత్రిక తెలిపింది. స్వాతంత్ర్య సాధన కోసం భగత్ సింగ్ చేసిన కృషిని పాక్ గుర్తించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. లాహోర్లోని జైలులోనే భగత్ సింగ్ ఉరితీయబడ్డారు.
స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన భగత్సింగ్ను 1931 మార్చిలో లాహోర్ జైలులో ఉరితీశారు. అప్పట్లో ఆ జైలు ఉన్న స్థానంలోనే ఇప్పుడు షాద్మాన్ చౌరస్తా ఉంది. అందుకే ఆ యోధుని సాహసాలకు గుర్తుగా భగత్సింగ్ చౌరస్తాగా దానికి నామకరణం చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు. కొన్నేళ్లుగా లాహోర్లోని కొన్ని ప్రాంతాలకు, పాత క్వార్టర్స్కు ఉన్న హిందూ పేర్లను మార్చిన పాక్ అధికారులు దీనికి భగత్సింగ్ చౌరస్తా అని పేరుమార్చడం సాహసవంతమైన నిర్ణయమే.
పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం ముస్లిం, హిందూ, సిక్కు, క్రైస్తవ మతాలకు చెందిన వారికి దేశంలో సమాన హక్కులు ఉన్నాయని అందుకే భగత్ సింగ్ పేరుపెట్టడానికి ఎవరూ అభ్యంతరం పెట్టకూడదని జిల్లా పరిపాలనా విభాగం చీఫ్ నూరుల్ అమీన్ మెంగల్ వ్యాఖ్యానించారు. భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం పింగా లాహోర్కు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ భగత్ సింగ్ తాత నిర్మించిన ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉందని దానికి మరమ్మతులు చేయించడంపై అధికారులు దృష్టి పెట్టాలని... భగత్ సింగ్ నివసించిన ఇంట్లో ఉంటున్న ఇక్బాల్ విర్క్ కోరారు.