బోర్డు తిప్పేశారు: ఏజెంట్ సూసైడ్, సమాధానమివ్వలేకే
ఇప్పటి వరకు ఖాతాదారుల నుండి దాదాపు రూ.500 కోట్ల మేర సేకరించినట్లుగా అనుమానిస్తున్నారు. నర్సీపట్నం సిమ్స్ కార్యాలయం ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఇక్కడి సిమ్స్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయానికి తాళాలు వేశారు. నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఆగ్రహం పట్టలేక ఖాతాదారులు వారిపై దాడి చేసే ప్రయత్నాలు చేశారు.
అన్ని సిమ్స్ కార్యాలయాల వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. సిమ్స్ డైరెక్టర్ సురేంద్ర తమ నుండి కోట్లాది రూపాయలు వసూలు చేశారని, ఆయన తమను మోసం చేయడం కాకుండా, తనకు ఉన్న ఆస్తులను ఖాతాదారులకు పంచాలని వారు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో ఇలాంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలు పుట్టుకు వచ్చి ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాయని మండిపడ్డారు.
ఏజెంటు ఆత్మహత్య
సిమ్స్ సంస్థ బోర్డు తిప్పేయడం ఓ ఏజెంటు ప్రాణాల మీదకు తెచ్చింది. నర్సీపట్నంలో రాంబాబు అనే వ్యక్తి సిమ్స్ ఏజెంటుగా పని చేశాడు. అతను ఖాతాదారులను చేర్పించాడు. ఇప్పుడు సిమ్స్ బోర్డు తిప్పేయడంతో తన ఖాతాదారులకు సమాధానం చెప్పలేక అతను ఈ రోజు ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
సిబిసిఐడికి
సిమ్స్ శఠగోపంపై మంత్రి గంటా శ్రీనివాస రావు స్పందించారు. సిమ్స్ కేసును సిబిసిఐడికి అప్పగిస్తామని ఆయన చెప్పారు.