జగన్, కెసిఆర్లను కిరణ్ రెడ్డి ఎదుర్కోగలరా?
హైదరాబాద్: తెలంగాణపై నిర్ణయం తీసుకోకుండా ప్రస్తుత నాయకత్వంతోనే రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటనను బట్టి ఆ విషయం స్పష్టమవుతోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోనే ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లు అనుకోవచ్చు. కేంద్ర మంత్రి చిరంజీవి వంటి నేతలను ప్రచారానికి మాత్రమే వాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.
రవీంద్రారెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించడానికి ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వడంతోనే అధిష్టాన వర్గం అభిమతం అర్థమైంది. ఆయనకు పూర్తి అధికారాన్ని, స్వేచ్ఛను ఇచ్చినట్లు అనుకోవచ్చు. తెలంగాణలో వైయస్ రాజశేఖర రెడ్డి ఫార్ములాను వాడుకుని తన గ్రూపును కిరణ్ కుమార్ రెడ్డి పటిష్టం చేసుకున్నారు. మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, జగ్గారెడ్డి వంటివారితో తెలంగాణలో నెట్టుకురావడానికి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఢీకొట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నట్లు భావిస్తున్నారు.
తెలంగాణలో కనీసం కాంగ్రెసు పార్టీ 40 సీట్లు గెలుచుకుంటే పార్టీని తిరిగి అధికారంలోకి తిరిగి రావచ్చుననే ధీమాతో ఆయన ఉన్నారు. తెరాస బలంగా లేని నియోజకవర్గాల్లో విజయం సాధించే విధంగా ఆయన వ్యూహరచన చేస్తున్నట్లు భావిస్తున్నారు. అయితే, ఈ సీట్లలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పాగా వేయడానికి సిద్ధపడుతోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోతుందని భావిస్తున్నారు.
సీమాంధ్రలో కూడా తన వర్గం సహాయసహకారాలతోనే కాకుండా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి చిరంజీవి ప్రాబల్యంతో విజయాలు సాధించడానికి వీలవుతుందని అనుకుంటున్నారు. ఇది కాంగ్రెసు అధిష్టానం అంచనా. వైయస్ జగన్ ప్రాబల్యం క్రమక్రమంగా తగ్గుతుందని భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైయస్ రాజశేఖర రెడ్డిపై సానుభూతితో మాత్రమే నెట్టుకు రావడానికి ప్రయత్నిస్తోందని, ఆ సానుభూతి క్రమంగా తగ్గుతుందని కాంగ్రెసు అధిష్టానం అంచనా వేస్తోంది. దీంతో సీమాంధ్ర తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ఎదుర్కోవడం కష్టం కాదని కూడా భావిస్తున్నారు.
దానికితోడు, బంగారుతల్లి, అమ్మ హస్తం వంటి సంక్షేమ పథకాల ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బంగారుతల్లి, ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఇతోధికంగా ఉపయోగపడుతాయని కిరణ్ కుమార్ రెడ్డి అంచనా. దీంతో తెలంగాణలో కూడా కెసిఆర్ ప్రాబల్యాన్ని అడ్డుకోవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
మొత్తం మీద, కిరణ్ కుమార్ రెడ్డి మీదనే భారమంతా వేసి వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలని కృతనిశ్చయంతోనే కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఏ మేరకు వైయస్ జగన్ను, కెసిఆర్ను ఆయన ఎదుర్కోగలరనేది ఎన్నికల ఫలితాలు మాత్రమే తేలుస్తాయి.