హెలెన్ తర్వాత లెహర్: మరో తుఫాను ముప్పు?
హైదరాబాద్: హెలెన్ తుఫాను నష్టాన్ని అంచనా కూడా వేయకముందే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. హెలెన్ తుఫాను వాయుగుండంగా మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ స్థితిలోనే పోర్ల్ బ్లెయిర్కు 450 కిలోమీటర్ల దూరంలో మరో అల్పపీడనం ఏర్పడింది.
తాజా అల్పపీడనం ఉధృతమై, నవంబర్ 27వ తేదీ సాయంత్రం లేదా నవంబర్ 28వ తేదీ ఉదయానికి తీవ్రమైన తుఫానుగా మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అది తీవ్రమై తుఫానుగా మారితే దానికి లెహర్ నామకరణం చేయనున్నట్లు వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు చెబుతున్నారు.
ఫైలిన్ తుఫానుకు థాయలాండ్, హెలెన్ తుఫానుకు బంగ్లాదేశ్ నామకరణం చేశాయి. రాబోయే తుఫానుకు భారతదేశం పేరు పెడుతుంది. ప్రస్తుత అల్పపీడనం తుఫానుగా మారి, హెలెన్ వంటి ప్రభావాన్నే చూపవచ్చునని, రాష్ట్రంలోని కాకినాడ తీర ప్రాంతంలో తీవ్ర ప్రభావం వేయవచ్చునని అంటున్నారు.
నవంబర్, డిసెంబర్ నెలల్లో బంగాళాఖాతంలో తుఫానులు ఏర్పడడం సర్వసాధారణమని నిపుణులు అంటున్నారు. పైలిన్ తుఫాను తాకిడి నుంచి కోలుకోకముందే హెలెన్ తుఫాను తాకింది. ఇప్పుడు రాష్ట్రాన్ని మరో తుఫాను తాకితే తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.