రూ.7 వేల కోట్ల అక్రమాస్తులు: అగ్రి గోల్డ్ చైర్మన్, ఎండి అరెస్టు
విజయవాడ: అగ్రిగోల్డ్ అక్రమాస్తుల కేసులో సంస్థ చైర్మన అవ్వా వెంకట రామారావు(58), మేనేజింగ్ డైరెక్టర్ అవ్వా వెంకట శేషు నారాయణరావు(49)ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం 8 గంటలపాటు సుదీర్ఘ విచారణ అనంతరం వీరిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
నాలుగు రాష్ట్రాల్లోని ప్రజల నుంచి భారీ ఎత్తున నిధులను సేకరించి, సుమారు రూ.7 వేల కోట్లకుపైగా అక్రమాస్తులను సమకూర్చుకున్నారనే ఆరోపణలపై అగ్రిగోల్డ్ చైర్మన్, ఎండీ తదితరులపై కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. దీంతో ఏపీ సర్కార్ ఈ కేసు దర్యాప్తును సీఐడీకి బదలాయించింది. అక్రమాస్తుల లెక్కలు తేల్చేందుకు కుటుంబరావు నేతృత్వంలో ప్రత్యేకంగా ఆర్థిక వ్యవహారాల కమిటీని కూడా నియమించింది. అగ్రిగోల్డ్ కేసుల దర్యాప్తు జరుగుతున్న తీరుపై హైకోర్టు తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
శుక్రవారం హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందుగానే సీఐడీ ఎస్పీ బ్రహ్మారెడ్డి, డీఎస్పీ రాజగోపాల్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం అగ్రిగోల్డ్ చైర్మన, ఎండీలను అరెస్ట్ చేయడం గమనార్హం. శుక్రవారం ఏలూరు కోర్టులోనూ అగ్రి గోల్డ్ కేసుల విచారణ ఉండటంతో వీరిద్దరినీ అక్కడ హాజరుపరచనున్నట్లు సీఐడీ పోలీసులు తెలిపారు.
14 రోజుల రిమాండ్
అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకటరమణ, ఎండీ నారాయణలను పోలీసులు ఏలూరు అతిథి గృహంలో ప్రశ్నించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా, బాధితులు ఎండి, చైర్మన్ పైన దాడికి యత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు.