ఇదీ సీమ సంస్కృతి, బాబు అతి మంచి: ఎస్వీ, జగన్ కొట్టించాడు: యనమల
రాయలసీమకు ఓ సంస్కృతి ఉందని, తప్పు చేస్తే అంగీకరిస్తామని లేదంటే ప్రశ్నిస్తామని టిడిపి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి శుక్రవారం అన్నారు. అసెంబ్లీలో జగన్ తీరును నిరసిస్తూ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం
అమరావతి: రాయలసీమకు ఓ సంస్కృతి ఉందని, తప్పు చేస్తే అంగీకరిస్తామని లేదంటే ప్రశ్నిస్తామని టిడిపి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి శుక్రవారం అన్నారు. అసెంబ్లీలో జగన్ తీరును నిరసిస్తూ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశ పెట్టారు.
ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడారు. అనంతరం యనమల ప్రవేశ పెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష నేత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం అంగీకరించింది. ఆ తర్వాత సభ వాయిదా పడింది. అంతకుముందు ఎస్వీ మోహన్ రెడ్డి... జగన్పై దుమ్మెత్తి పోశారు.

రాయలసీమకు ఓ సంస్కృతి ఉంది
జగన్ ఎవరి మాటా వినకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. జగన్ ప్రవర్తనను తాము మొదటి నుంచీ చూశామన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకపోతున్నారని చెప్పారు. రాయలసీమకు ఓ సంస్కృతి ఉందని తప్పు చేస్తే ఒప్పుకుంటామని, లేదంటే పోరాడుతామన్నారు.
డబ్బులు తీసుకొని పార్టీ మారారని జగన్ ఆరోపణలు చేయడం విడ్డూరమని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పార్టీ మారిన వారు అందరూ డబ్బు తీసుకొనే పార్టీ మారినారా.. జగన్ చెప్పాలన్నారు. జగన్ కోరినట్లు జ్యూడిషియల్ విచారణకు సిద్ధమన్నా ఎందుకు వెనక్కి తగ్గారో చెప్పాలన్నారు.

చంద్రబాబు అతి మంచితనం
చంద్రబాబు అతిమంచితనం కూడా జగన్ను కాపాడుతుందని ఎస్వీ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ ఇంత చేసినప్పటికీ.. కేవలం ఆయన వ్యాఖ్యలను ఖండించేందుకే తీర్మానం పెట్టామని చెప్పారు. తద్వారా జగన్పై చర్యలు కాకుండా ఖండనకే తీర్మానం ప్రవేశ పెట్టడం అతిమంచితనం అన్నారు. తన పార్టీ మంత్రిపై ఆరోపణలు వస్తే ఎవరు కూడా న్యాయ విచారణకు అంగీకరించరని, కానీ చంద్రబాబు అంగీకరించారని మోహన్ రెడ్డి చెప్పారు.

2019 నాటికి అందరూ టిడిపిలోకి..
2019 నాటికి వైసిపి నుంచి అందరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతారని మోహన్ రెడ్డి అన్నారు. జగన్ ప్రవర్తనతో విసుగు చెంది 21 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారన్నారు. మిగతా ఎమ్మెల్యేలకు కూడా జ్ఞానోదయం అవుతుందన్నారు.

ప్రతిపక్ష నేతగా ఎవరూ చూడరు
జగన్ తాత రాజారెడ్డి చరిత్ర అందరికీ తెలుసునని, ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రతిపక్ష నేత సవాల్కు సీఎం అంగీకరించారన్నారు. హౌస్ కమిటీకి, న్యాయ విచారణకు సీఎం చంద్రబాబు అంగీకరించారన్నారు. ఆరోపణలపై నిలబడకుండా సభ నుంచి వెళ్లిపోయారన్నారు. ఇకపై ఆయనను ప్రతిపక్ష నేతగా ఎవరూ చూడలేరన్నారు. జగన్కు అహం ఉందని, ధనం ఉన్నందు వల్లే అహం వచ్చిందన్నారు.

ఫోటో గ్రాఫర్లను కొట్టించారు
రూ.43వేల కోట్ల జగన్ ఆస్తులను అటాచ్ చేశారని, అప్పుడు క్రిమినల్ మైండ్ ఎవరిదో తెలుస్తుందన్నారు. సభలో కనీసం పాటించాల్సిన నిబంధనలు జగన్ పాటించలేదన్నారు. జగన్ సైకోలా తయారయ్యాడన్నారు. బెంగళూరు ప్యాలెస్ను చిత్రీకరించడానికి వెళ్తే ఫోటోగ్రాఫర్లను కొట్టించారని చెప్పారు. సంతోషం లేనప్పుడు ఎంత పెద్ద ప్యాలెస్ కట్టినా ప్రయోజనం లేదన్నారు. ప్యాలెస్ కడితే ఏం లాభమని, వెళ్లి జగన్ జైల్లో పడుకున్నారన్నారు.

మరోసారి ఇలా చేస్తే..
నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం జగన్కు అలవాటుగా మారిందన్నారు. సభా సమయాన్ని వృథా చేయడం సరికాదన్నారు. మరోసారి రిపీట్ కాకుండా వైసిపి చూసుకోవాలని లేదంటే డిస్క్వాలిఫై చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి సభకు రావడం దురదృష్టకరమన్నారు.












Click it and Unblock the Notifications