జగన్ సంచలన నిర్ణయం: రాజధాని పనులకు తాత్కాలిక బ్రేక్: సమీక్ష తరువాతే తుది నిర్ణయం..!
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో నెలకొన్న ఆర్దిక పరిస్థితులు.. రాజధానిలో అవినీతి జరిగిందనే ఆరోపణల కారణంగా రాజధానిలోని కొన్ని పనులకు తాత్కాలిక బ్రేక్ వేయాలని నిర్ణయించారు. దీని పైన పూర్తి స్థాయిలో ఈనెల 6న ముఖ్యమంత్రి జగన్ సమీక్షించనున్నారు. అందులో పనులు.. ఖర్చు.. నాణ్యత..టెండర్లు వంటివి పరిశీలించిన తరువాత పనులను కొనసాగించాలా ..వద్దా అనే దాని పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. పాలనకు ఎటువంటి ఇబ్బంది లేక పోవటంతో ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.
పనులకు తాత్కాలిక బ్రేక్..
ఏపీలో విప్లవాత్మక నిర్ణయాలు..అవినీతి రహిత పాలన..సంస్కరణలు చేపడతానని ప్రకటించిన నూతన ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో నెలకొన్న ఆర్దిక పరిస్థితుల దృష్ట్యా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు .. ఎక్కువ ఖర్చుతో జరుగుతున్న నిర్మాణాలు..బిల్లుల చెల్లింపు పైన దృష్టి సారించారు. అందులో భాగంగా..రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం వందల కోట్ల ఖర్చుతో నిర్మాణం జరుగుతున్న శాశ్వత హైకోర్టు..అసెంబ్లీ..సచివాలయం పనుల పైన ఆరా తీస్తున్నారు. ఈ పనులను తాత్కాలికంగా నిలుపుదల చేస్తే ఎటువంటి ప్రభావం పడుతుందనే అంశం పైనా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఆర్దికంగా కొంత వెసులుబాటు కావాలంటే బిల్లుల ఒత్తిడి తగ్గించుకోవాలని నిర్ణయించారు. దీని కోసం ఇప్పుడు రాజధానిలో జరుగుతున్న పనుల్లో వెంటనే పూర్తి చేయాల్సినవి మినహాయించి.. శాశ్వత భవనాలుగా నిర్మాణంలో ఉన్న హైకోర్టు..అసెంబ్లీ..సచివాలయ పనులను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించింది.
రాజకీయంగా నష్టం కలుగుతుందా..
ఈ నిర్ణయం అమలు చేయాలంటే దాని ద్వారా ఎదురయ్యే సానుకూలతలు..ప్రతికూలతల పైనా అధ్యయనం చేస్తున్నారు. ఎన్నికల్లో జగన్ గెలిచే వరకూ కూడా టీడీపీ శ్రేణులు ప్రతిపక్ష నేత అమరావతికి వ్యతిరేకమని..ఆయన అధికారంలోకి వస్తే రాజధాని నిలిచిపోతుందని ప్రచారం చేసారు. ఆర్దికంగా ఎన్ని కష్టాలు వచ్చినా..కేంద్ర సాయం లేకున్నా తాము రాజధాని నిర్మాణం వేగంగా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆర్దిక కష్టాలను తప్పించుకొనేందుకు తాత్కాలికంగా పనులు నిలిపివేస్తే రాజకీయంగా దుమారం చెలరేగే అవకాశం ఉంది. ఇదే సమయంలో వీటి నిర్మాణాలను కొద్ది కాలం నిలిపిస్తే వాటిని పూర్తి చేసేందుకు నిర్ణయించిన సమయం పైన ప్రభావం పడటంతో పాటుగా ఆర్దికంగా ఏ మేర వెసులుబాటు కలుగుతుందనే అంశం పైన దృష్టి సారించారు.
6న సమీక్షలో నిర్ణయం..
ముఖ్యమంత్రి హోదాలో జగన్ జూన్ 6వ తేదీన సీఆర్డీఏ గురించి సమీక్ష ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో రాజధాని లో జరుగుతున్న పనులు ..ఆర్దిక వనరులు..తెచ్చిన అప్పులు..తక్షణం దృష్టి పెట్టాల్సిన పనులు..ఆలస్యమైనా ఇబ్బంది లేని నిర్మాణాల వంటి వాటి పైన సమాచారం కోరారు. వారిచ్చే నివేదిక ఆధారంగా..తుది నిర్ణయం తీసుకోనున్నారు. హైకోర్టు..సచివాలయం..అసెంబ్లీ శాశ్వత నిర్మాణాలు వెంటనే పూర్తి చేయకపోయినా..పాలనా పరంగా ఇబ్బంది ఉండదని అధికారులు నివేదించారు. దీంతో..ఇప్పుడు జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారింది.