జగన్! ఏ ముఖం పెట్టుకు వెళ్తున్నారు: మంత్రి పల్లె విమర్శలు
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏ ముఖం పెట్టుకుని వైయస్ జగన్.. అనంతపురంలో అడుగుపెడతారని విమర్శించారు. రైతు భరోసా యాత్ర పేరుతు బుధవారం నుంచి అనంతపురంలోని తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో జగన్ పర్యటిస్తున్న నేపథ్యంలో మంత్రి పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
విజయవాడలో బుధవారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. రైతుల రుణమాఫీపై జగన్ పలు రకాల వ్యాఖ్యలు చేశారని, దీనికి అమెరికా అంత బడ్జెట్ అవసరమవుతుందని అన్నారని పల్లె వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వైయస్ జగన్.. అనంతలో పర్యటిస్తున్నారని ఆయన నిలదీశారు.
తన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే జగన్.. రైతుల కోసం అంటూ భరోసా యాత్రలు చేస్తున్నారని మంత్రి పల్లె విమర్శించారు. జగన్కు రైతులపై ఎలాంటి ప్రేమా లేదని అన్నారు.
ముద్రగడను విమర్శించేంత ఉందా?
హైదరాబాద్: ముద్రగడను విమర్శించే అర్హత ఏపీ మంత్రులకు లేదని కాపు యువసేన మండిపడింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యువసేన నాయకులు కర్ణా శ్రీనివాస్, రాఘవరావుమాట్లాడుతూ ఎన్నికల ముందు టిడిపి అధినేత ఇచ్చిన హామీని నెరవేర్చమని ముద్రగడ అడగడం తప్పా అని ప్రశ్నించారు.
మాట ఇచ్చి తప్పిన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసినందుకు మంత్రులు గంటా శ్రీనివాసరావు, చిన్నరాజప్ప, పి నారాయణ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కాపు జాతి కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన ముద్రగడను విమర్శించే అర్హత మంత్రులకు ఎక్కడిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాపులను బిసిల్లో చేర్చే అంశంపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన ముంజునాథ్ కమిషన్ ఇంత వరకు పని ప్రారంభించని విషయం కాపు మంత్రులకు తెలియదా? అని నిలదీశారు. అధినేత మెప్పుకోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాపుల ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు.