మేం అంగీకరించం: పిపిఎలపై పరకాల ప్రభాకర్ కొర్రీ
ఎపిఇఆర్సి నిర్ణయం వల్ల తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల నుంచి తెలంగాణ విద్యుత్తు కొంత మేరకు పంపిణీ అయ్యే అవకాశం ఉంటుంది. నిజానికి, పిపిఎలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పిపిఎలపై ఎపిఇఆర్సి ఇచ్చిన ఆదేశాలను ఎపి ప్రభుత్వం తిరస్కరించేందుకు సిద్ధపడింది.
గత ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పిపిఏ) లను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ ఎపిఇఆర్సి చైర్మన్ భాస్కర్, సభ్యులు అశోక్చారి, రాజగోపాల్రెడ్డి ప్రకటించిన ఆదేశాలను తమ ప్రభుత్వం తిరస్కరిస్తోందని పరకాల ప్రభాకర్ అన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఏపీఇఆర్సి ప్రస్తుతం మనుగడలో లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మనుగడలోలేని మండలికి గుర్తింపు ఉండదని, ఆదేశాలు జారీ చేసేందుకు దానికి అధికారం లేదని పరకాల స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 12వ షెడ్యూల్ ప్రకారం ఆరు నెలలలోగా రెండు కొత్త రాష్ట్రాలు తమతమ రాష్ట్రాల్లో ఇఆర్సిలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2014 జూలై 26న తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిని (టిఇఆర్సి) ఏర్పాటు చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 1న ఏపిఇఆర్సిని ఏర్పాటు చేస్తూ జీఓ జారీ చేసిందన్నారు.
రెండు రాష్ట్రాలు ఇఆర్సిలను ఏర్పాటు చేసుకోవడం వల్ల సమైక్య రాష్ట్రంలో ఏర్పడిన ఎపిఇఆర్సి రద్దయినట్టేనని స్పష్టం చేశారు. 2009 నుండి 2014 వరకు పిపిఏలపై ఎలాంటి నిర్ణయం ప్రకటించని ఎపిఇఆర్సి, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో కుదిరిన పిపిఏలు అమల్లో ఉంటాయని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇది తమకు ఆమోదయోగ్యం కాదని, పాత ఇఆర్సికి న్యాయపరమైన, పాలనాపరమైన అధికారాలతోసహా ఎలాంటి అధికారాలు లేవని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిన పిపిఏలు దాదాపు ఐదువేల మెగావాట్ల విద్యుత్తుకు సంబంధించినవని, ఇవన్నీ ప్రభుత్వరంగ సంస్థలే కావడం గమనార్హమని పరకాల ప్రభాకర్ వివరించారు.