వైసిపిలోకి శిల్పా, రంగంలోకి చంద్రబాబు?: జగన్ పార్టీలో రూట్ క్లియర్
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికలు తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారని తెలుస్తోంది.
తనను కలవాలని చంద్రబాబు.. శిల్పా మోహన్ రెడ్డికి చెప్పారని తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో టిక్కెట్ను భూమా కుటుంబానికి ఇవ్వాలని అధిష్టానం దాదాపు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న శిల్ప టిడిపిని వీడేందుకు సిద్ధమవడంతో సీఎం రంగంలోకి దిగారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, నంద్యాల టిక్కెట్ కోసం శిల్పా మోహన్ రెడ్డి మాత్రం ఏమాత్రం తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఇస్తే టిక్కెట్ ఇవ్వాలి.. లేదంటే పార్టీని వీడాలి అన్న ఉద్దేశ్యంతో ఉన్నారని తెలుస్తోంది. టిక్కెట్పై వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.

వైసిపిలో చేరడం ఖాయమేనా?
టిడిపి కూడా టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోవడంతో శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటికే ఆయన కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసేసుకున్నారని అంటున్నారు. ఈ రోజు మరోసారి అనుచరులతో భేటీ అయి ప్రకటన చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

జగన్ ప్రకటన
శిల్పా మోహన్ రెడ్డి ఒకటి రెండు రోజుల్లో జగన్తో భేటీ కానున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత 21న లేదా 22న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి పోటీ చేస్తుందని ఇప్పటికే జగన్ ప్రకటించారు.

పోటీలో లేరు
ఈ నేపథ్యంలో ఆ టిక్కెట్ శిల్పాకే ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. నంద్యాల నుంచి గతంలో వైసిపి నుంచి భూమా నాగిరెడ్డి పోటీ చేశారు. ఆయన మృతి నేపథ్యంలో వైసిపి నుంచి దాదాపు ఎవరూ పోటీలో లేరు. కాబట్టి జగన్ కూడా శిల్పాకు టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధంగానే ఉంటారని అంటున్నారు.

జగన్ సిద్ధం
భూమా కుటుంబం టిడిపిలో చేరడంతో జగన్ ఆగ్రహం, ఆవేదనతో ఉన్నారు. భూమా కుటుంబానికి చెక్ చెప్పేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే శిల్పా వస్తే సాదరంగా ఆహ్వానించడంతో పాటు ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉంటారని అంటున్నారు.

టిడిపి ధీమా
శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారినా వచ్చే ఇబ్బందులేవీ ఉండవని, తమదే గెలుపు అని టిడిపి భావిస్తోంది. భూమా కుటుంబానికి ఉన్న పట్టు, వారి కుటుంబం నుంచి పోటీ చేస్తే మద్దతిస్తామని సీనియర్లు చెప్పడం, శిల్పా చక్రపాణి రెడ్డి సహకారం.. ఇలా అన్ని కలిపి టిడిపి గెలుపు సాధ్యమని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications