ఇదేమిటి, బాబూ! చరిత్రను గుర్తించరా: వైయస్ జగన్
హైదరాబాద్: చరిత్ర అనేది ఎంత అవసరమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా గుర్తించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదీన నిర్వహించకూడదనే చంద్రబాబు నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు. హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా జాతీయ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు.
మహానుభావుల త్యాగాల ఫలితంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని, ఆ త్యాగాలను గుర్తించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా అందరికీ హృదయపూర్వక అభినందనలు అని ఆయన అన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద నవంబర్ 1వతేదీన ఆంధ్రప్రదేశ్ అవతరించిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు నవంబర్ 1వ తేదీ ఎప్పుడు వచ్చినా ఎందరో త్యాగమూర్తులు గుర్తుకు వస్తారని ఆయన అన్నారు.
వారి త్యాగాలు గుర్తుకు వస్తాయని, తెలుగువాళ్లు ఎక్కడున్నా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన విషయం గుర్తుకు వస్తుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అలాగే ఉందని, తెలంగాణ మాత్రమే జూన్ 2వ తేదీన ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని, తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2 అంటే అర్థం ఉంది గానీ ఆ రోజే ఆంధ్రప్రదేశ్ అవతరించిందని అనడం అర్ఙరహితమని జగన్ అన్నారు.
మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అవి ఏర్పడిన తేదీలు మారలేదని, ఆ రాష్ట్రాల నుంచి కూడా విడివడి మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. కానీ ఇక్కడ చంద్రబాబు ఏ ఉద్దేశంతో చేశారో తెలియడం లేదని ఆయన అన్నారు. చరిత్ర అనవసరమైన సబ్జెక్టు అని చంద్రబాబు అంటూ ఉంటారని, కానీ చరిత్ర అన్నది ఎంత అవసరమో ఇప్పటికైనా గుమనిస్తే త్యాగాలు చేసినవారిని గుర్తించినట్లు అవుతుందని ఆయన అన్నారు.
చంద్రబాబు తాను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆయన సూచించారు. నవంబర్ 1వ తేదీ ప్రాధాన్యాన్ని చంద్రబాబు గుర్తించాలని అన్నారు. లేదంటే తమ ప్రభుత్వం వచ్చినప్పుడు నవంబర్ 1వ తేదీన్నే రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతామని ఆయన చెప్పారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జగన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, జ్యోతుల నెహ్రూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.