కమ్యూనిస్టులు దొంగలన్న జెసి వ్యాఖ్యలపై మండిపడ్డ వామపక్ష నేతలు...అతడో మానసిక రోగి!
విజయవాడ:కమ్యూనిస్టులు దొంగలంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వామపక్షాల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కమ్యూనిస్టులను దుర్భాషలాడిన ఎంపీ జేసీ ఒక మానసిక రోగి అని వారు ధ్వజమెత్తారు.
జేసీ దివాకర్ రెడ్డి వెంటనే కమ్యూనిస్టులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనను టీడీపీ నుంచి బహిష్కరించాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు. అసలు జేసీ కన్నా పెద్ద దొంగ రాష్ట్రంలో మరొకరు లేరని వారు ఎద్దేవా చేశారు. "ఒక బస్సుకు పర్మిషన్ తీసుకొని నాలుగు బస్సులు నడుపుతున్న దొంగ జేసీ. బినామీల పేరుతో వందల ఎకరాల భూములు కాజేసి సిమెంట్ ఘనుడు జేసీ"...అని వామపక్ష నేతలు ఆరోపణాస్త్రాలతో విరుచుకుపడ్డారు.
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని మర్తాడు క్రాస్ సమీపంలో మంగళవారం రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎందుకూ పనికిరాని వెధవలని విశ్లేషించిన ఆయన...కమ్యూనిస్టులు పెద్ద దొంగలంటూ వ్యాఖ్యానించారు. తాను అసెంబ్లీకి వెళ్లకముందు కమ్యూనిస్టులంటే చాలా మంచివారనే అభిప్రాయంతో ఉండేవాడిననీ, కానీ కమ్యూనిస్టులంత దొంగలు ఎక్కడా లేరని ఆ తర్వాత తెలుసుకున్నానని అన్నారు.
దీనిపై స్పందించిన కమ్యూనిస్టులు...టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వెధవలు అన్న జేసీ...మరి వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు ఏమవుతారో కూడా చెప్పాలని వారు ప్రశ్నించారు. వామపక్ష నేతలు ఎక్కడ దొంగతనం చేశారో జేసీ చెప్పాలన్నారు. రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి అని, ఆయన కల్లు తగిన కోతి లాంటి వాడు అని మండిపడ్డారు. జేసీ క్షమాపణ చెప్పకపోతే ఆయనపై కేసులు పెడతామని వామపక్ష నేతలు ఈ సందర్భంగా హెచ్చరించారు.