జైలు నుంచి వచ్చేందుకే విభజనకు సహకరించారు: జగన్పై దేవినేని
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మంగళవారం నాడు తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు. నాడు జగన్ జైలు నుంచి బయటకు వచ్చేందుకే విభజనకు సహకరించారని బాంబు పేల్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ అని, సహకరించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. జైలు నుంచి బయటకు వచ్చేందుకు విభజనకు సహకరించిన జగన్కు తమను విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.
జగన్కు డబ్బు పిచ్చి ఉందని, మాకు మాత్రం ప్రాజెక్టుల పిచ్చి ఉందన్నారు. త్వరితగతిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏపీ అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారన్నారు. త్వరలో వైసిపి మూతపడే రోజులు వస్తాయని చెప్పారు.

తెలంగాణలో అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే జగన్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. ఏపీని తాము అభివృద్ధి చేస్తుంటే సహకరించాల్సింది పోయి విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్కు లేదన్నారు.
ప్రజలను మభ్యపెట్టేందుకే వైసిపి ధర్నాలంటూ కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. హంద్రీనీవా, హిందూపూర్, కుప్పం కాలువల నిర్మాణాన్ని పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు నీరందించేందుకు తాము కట్టుబడివున్నామన్నారు.
మైలవరం రిజర్వాయర్, పోతిరెడ్డి పాడు కాలువలను సత్వరమే పూర్తి చేస్తామన్నారు. ఏడాదిలోపు పట్టిసీమను పూర్తి చేసి చూపామని, మిగతా ప్రాజెక్టుల విషయంలోనూ అదే విధమైన అంకితభావం ఉందన్నారు. హోదా పైన ఆనాడే ప్రయివేటు బిల్లు పెడితే బాగుండేదన్నారు.












Click it and Unblock the Notifications