'జగన్ దెబ్బకు గోల్డ్ మెడల్ సాధించిన ఐఏఎస్లు జైలుకు, 2019 టీడీపీకే ప్రజలు పట్టం'
విజయవాడ: ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి కనీస అవగాహన లేదని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వైసీపీ మూతపడుతుందన్నారు. అందుకే ప్రాజెక్టులపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు.
వంశధార ఫేజ్ 2 పనులపై జగన్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రైతుల పంటలు ఎండిపోకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాజెక్టులను చేపట్టినట్లు జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటని చెప్పారు. 13 కేసుల్లో ఏ1, ఏ2గా ఉన్న జగన్, విజయ సాయిరెడ్డిలు అవినీతిరహిత పాలన అందిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

ఏం మాట్లాడుతున్నాడో జగన్కు తెలియదు
భారత శిక్షా స్మృతిలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అవన్నీ జగన్, విజయసాయి రెడ్డిపై నమోదయి ఉన్నాయని దేవినేని అన్నారు. అలాంటి వ్యక్తి అవినీతిరహిత పాలన అందిస్తానంటే నమ్మటానికి ప్రజలు వెర్రివాళ్లు కాదని చెప్పారు. జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ రూ.వేలాది కోట్లు దోచుకున్నారన్నారు.

2019లో జగన్కు అధికారం అప్పగిస్తే
అలాంటి జగన్కు 2019లో అధికారం అప్పగిస్తే ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని దేవినేని చెప్పారు. పదహారు నెలలు జైల్లో ఉన్నా జగన్లో మార్పు రాలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. వారు రాజీనామా పేరుతో డ్రామాలు ఆడారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ డైరెక్షన్లో జగన్ యాక్షన్ చేస్తున్నారన్నారు.

గోల్డ్ మెడల్ సాధించిన ఐఏఎస్లు జైలుకు వెళ్లారు
జగన్ అవినీతికి పాల్పడ్డాడు కాబట్టే ఆయనకు చెందిన రూ.వేల కోట్లను ఈడీ జప్తు చేసిందని దేవినేని ఉమ చెప్పారు. ఏపీలో అన్ని పంటలకు నీరు అందిస్తున్న ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదే అన్నారు. 13 అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ అవినీతిరహిత పాలన తెస్తాననడం దొంగే.. దొంగ.. దొంగ.. అని అన్నట్లుగా ఉందన్నారు. జగన్ దెబ్బకు గోల్డ్ మెడల్ సాధించిన ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు మరోసారి అధికారం అప్పగిస్తారన్నారు.

చంద్రబాబు బలం, బలహీనత వారే
ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ పాదయాత్రలో ప్రజలకు అవినీతిరహిత పాలన అందిస్తామని చెప్పడం 21వ శతాబ్దపు పెద్ద జోక్ అని ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న వేరుగా అన్నారు. తెలంగాణాలో ప్రజా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా జగన్, పవన్ కేసీఆర్తో రహస్య కూటమి కట్టారని, ఆ కూటమికి మోడీ నాయకత్వం వహిస్తున్నారన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఉన్న రాజకీయ కలుపు మొక్కలను ఏరివేయడానికి చంద్రబాబు ప్రకృతి వ్యవసాయం చేపట్టారన్నారు. చంద్రబాబు బలం, బలహీనత ప్రజలే అన్నారు.












Click it and Unblock the Notifications