కృష్ణా కరకట్ట: చెన్నై వరదలు-అమరావతి మాస్టర్ ప్లాన్, దగ్గర్లో రైతులకు ప్లాట్లు
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతం వరద ముంపుకు గురికాకుండా మాస్టర్ ప్లాన్లో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల తమిళనాడు రాజధాని చెన్నైలో వరదలు బీభత్సం సృష్టించాయి. చెన్నై నగరం కకలావికలమైంది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు తరలి వెళ్లే విషయమై కూడా చర్చ జరిగింది.
ఈ నేపథ్యంలో అమరావతి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తరుచూ ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అవి ఎత్తుగా ఉండేలా చూడాలని మాస్టర్ ప్లాన్లో పేర్కొన్నారు. కృష్ణా నది వెంబడి ప్రస్తుతం 3 నుంచి 5 మీటర్ల ఎత్తులో కరకట్ట ఉంది.
దీనికి బదులు నదికి దగ్గర్లో కొత్త కట్ట నిర్మించాలని, ఆ తర్వాత పాత దానిని తొలగించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధికి ఉపయోగించాలని మాస్టర్ ప్లాన్లో పేర్కొన్నారు. ప్రధాన కాలువల పక్కన వరద నియంత్రణకు 30 మీటర్ల వరకూ స్థలాన్ని ఖాళీగా వదలాలి. దానిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు.
కృష్ణా, గోదావరి జలాలను వాడుకోవడానికి వీలుగా రాజధాని ప్రాంతానికి ఆవల జలాశయాలు నిర్మించాలని ప్రతిపాదించారు. రాజధానికి వ్యవసాయ భూములు వినియోగిస్తున్నందున ఆ మేరకు మిగిలే సాగునీటి నిల్వ చేయడానికి కూడా అవసరమని పేర్కొన్నారు.
కొండవీటివాగు పరివాహక ప్రాంతంలోని వర్షం నీటిని నిల్వ చేసేందుకు ఆరు టీఎంసీల సామర్థ్యంతో రెండు జలాశయాలు నిర్మించాల్సి ఉందని, ఇవి రాజధాని పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ఈ జలాశయాలు నిండిన తర్వాత కృష్ణా నదిలోకి నీటిని వదలాలని, జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. ఇంకుడు గుంతలు తప్పనిసరి అని పేర్కొంది.
ఇదిలా ఉండగా, రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఆయా గ్రామాల సమీపంలోనే నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయించనున్నారు. రాజధానిలో ఎక్కడెక్కడ ఏయే నిర్మాణాలు, వాణిజ్య స్థలాలు, రోడ్డు, రవాణా మార్గాలు, రక్షిత ప్రదేశాలు, ప్రభుత్వ, విద్యా, వివిధ ప్రత్యేక జోన్లు వస్తాయో మాస్టర్ ప్లాన్లో పేర్కొన్నారు.
రైతులకు ఇస్తున్న నివాస ప్లాట్లలో మద్యస్థాయి నుంచి అధఇక సాంద్రత కలిగిన నివాస సముదాయాలకు అనుమతి ఇవ్వనున్నారు. అధిక సాంద్రకత కలిగిన ప్రాంతాల్లో గరిష్ఠంగా 15 అంతస్తుల వరకు అనుమతించనున్నారు.