తిరుమలలో భక్తులకు విద్యుత్ షాక్, వి కోటలో జలపాతంలో పడి విద్యార్థి మృతి
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు బుధవారం విద్యుత్ షాక్ తగిలింది. ఆలయ ప్రవేశ మార్గంలోని లగేజి స్కానింగ్ సెంటర్ వద్ద ఈ ఘటన జరగింది.
చిత్తూరు: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు బుధవారం విద్యుత్ షాక్ తగిలింది. ఆలయ ప్రవేశ మార్గంలోని లగేజి స్కానింగ్ సెంటర్ వద్ద ఈ ఘటన జరగింది.
విద్యుత్ షాక్ భయంతో భక్తులు పరుగులు తీశారు. ఈ సందర్భంగా నెలకొన్న తోపులాటలో పలువురు గాయపడ్డారు. క్యూలైన్లో ముందుగా ఉన్న భక్తులకు షాక్ తగలడంతో వారు పరుగులు తీశారు.
ఏం జరిగిందో తెలియకపోవడంతో వెనుక ఉన్న భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. సమాచారం తెలుసుకున్న సిబ్బంది మేల్కొని అక్కడ ఉన్న కరెంట్ను ఆఫ్ చేశారు. దీంతో ప్రమాదం తప్పింది.
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
చిత్తూరు జిల్లా వి కోటలో సెల్ఫీ సరదా ఓ ప్రాణం తీసింది. జలపాతం వద్ద సెల్ఫీ దిగుతున్న బాలాజి అనే డిగ్రీ విద్యార్థి అదుపుతప్పి జలపాతంలో గల్లంతయ్యాడు. విహార యాత్ర విషాదంగా ముగియడంతో స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.