రేణిగుంట మల్లాది ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు
చిత్తూరు: జిల్లాలోని రేణిగుంట పారిశ్రామికవాడలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్లాది డ్రగ్స్ ఫార్మాసూటికల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో పదిమంది గాయాలపాలయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
కాగా, ఘటన జరిగిన సమయంలో కంపెనీలో మొత్తం 12మంది ఉండగా, వారిలో మంటల్లో చిక్కున్న పది మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కెమికల్స్ తయారు చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. అనుభవం లేని సిబ్బందితో పని చేయిస్తున్న కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఘటనకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారిస్తున్నట్లు సమాచారం.