హైదరాబాద్ యుటి చేయాలని అడుగుతాం: టీ సర్కార్పై గంటా ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయకుంటే ఉమ్మడి రాజధానిని కేంద్ర పాలిత ప్రాంతం (యుటి) చేయాలని తాము డిమాండ్ చేస్తామని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం వితండవాదం చేస్తోందని, అందుకే తాము పోరాటం చేస్తామని చెప్పారు. సెక్షన్ 8ను అమలు చేయాలని అందరూ అడుగుతున్నారని, ఇప్పటి వరకు సర్దుకుపోయామని, ఇక సర్దుకపోయేది లేదని ఆయన అన్నారు. హైదరాబాదులో గవర్నర్కే పూర్తి అధికారాలు ఉంటాయని మంత్రి అభిప్రాయపడ్డారు.
తమకు తెలంగాణ ప్రభుత్వం రికార్డులు కూడా ఇవ్వడం లేదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర పునర్విభజన బిల్లులోని అంశాల అమలుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన విమర్శించారు. ఈ అంశాలన్నింటినీ గవర్నర్కు వివరిస్తామని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్ర విద్యార్థుల సమస్యల పట్ల దారుణంగా ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. ఓపెన్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థుల ఫలితాలు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. పరీక్ష అందరికీ నిర్వహించి ఫలితాల ప్రకటనలో వివక్ష చూపడం దారుణమని మంత్రి అన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగంలా వ్యవహరించడం లేదని గంటా అన్నారు. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని అన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల రికార్డులు అప్పగిస్తామని మంత్రి చెప్పినా అధికారులు రికార్డులు ఇవ్వడం లేదని చెప్పారు. దానిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. జులై 9వ తేదీ నుంచి ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్, 24 నుంచి పిజీ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.