రేపటి ఆంధ్ర ఎంసెట్, డిఎస్సీలకు 7 లక్షలు: అభ్యర్థులకు ఆర్టీసి సమ్మె భయం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఎంసెట్ రేపు (శుక్రవారం) జరగనుంది. ఆర్టీసి సమ్మె జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో ఆందోళన చోటు చేసుకుంది. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రులు, అధికారులు చెబుతున్నారు. రేపటి ఎపి ఎంసెట్కు, డిఎస్సీకి 7 లక్షల మంది హాజరవుతున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు.
విద్యార్థులకు సంక్షేమ హాస్టళ్లలో వసతి ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. విద్యార్థుల వివరాలను ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులకు పంపించినట్టు మంత్రి తెలిపారు. స్వల్ప అసౌకర్యం ఉన్నా విద్యార్థులు సహకరించాలని కోరారు. ప్రత్యేకమైన సందర్భాల్లో పరీక్షకు ఆలస్యమైతే స్థానిక పరీక్షాకేంద్ర అధికారి నిర్ణయం తీసుకుంటారన్నారు. డీఎస్సీని పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు మంత్రి చెప్పారు.
ఎంసెట్ విద్యార్థుల కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా 200 బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు ఎపి రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘరావు చెప్పారు. ఏపీ ఎంసెట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆర్టీసి ఎండీ సాంబశివరావు వెల్లడించారు. హైదరాబాదులో కూడా ఎపి ఎంసెట్ జరుగుతోంది.
అరగంట ఆలస్యమైనా...
ఎంసెట్ అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి అర గంట ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ చెప్పారు. వారి కోసం తాము 4,300 బస్సులను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. దూరంగా పరీక్షా కేంద్రాలు ఉన్న విద్యార్థులు రాత్రికే వాటి దగ్గరికి చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పరీక్షకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. వీలైనన్నీ ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను నడిపిస్తామని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ యూనియన్ నేతలు ఎంసెట్ పరీక్షకు సహకరించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.
విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. సమ్మెను వెంటనే విరమించాలని ఆయన ఆర్టీసి కార్మికులను కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని చర్చలకు పిలిచే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. ఒక వేళ వారంతట వారు చర్చలకు వస్తే మాట్లాడుతామని ఆయన అన్నారు. ఇప్పటికే ఆర్టీసి నష్టాల్లో ఉందని, తాము 27 శాతానికి మించి ఫిట్మెంట్ ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు.
సమ్మె విరమించాలి..
ప్రజల ఇబ్బందుల దృష్ట్యా కార్మికులు సమ్మె విరమించాలని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు కోరారు. సమ్మె విరమించి చర్చలకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. సమ్మె జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో 38 శాతం, తెలంగాణలో 15 శాతం బస్సులు నడుపుతున్నామని ఆయన చెప్పారు. సబ్ కమిటీతో నేరుగా చర్చిద్దామని సాంబశివరావు కార్మిక నేతలను ఆహ్వానించారు. 27శాతం ఫిట్మెంట్తో 15వేల మూల వేతనం 26 వేలకు పెరుగుతుందని ఆయన తెలిపారు.
కాంట్రాక్ట్ కార్మికులు విధులకు హాజరు కాకపోతే తొలగిస్తామని ఎండీ సాంబశివరావు హెచ్చరించారు. తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నవారిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమిస్తామని ఆయన అన్నారు. త్వరలో వేసే నోటిఫికేషన్లో 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి..
ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని, ఒక వేళ విఫలమైతే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. ఎంసెట్కు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించని విషయం తెలిసిందేనని, ఈ నేపథ్యంలో ఆర్టీసి సమ్మెను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆయన అన్నారు. ఆర్టీసి కార్మికుల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు.