చిచ్చు: ఒక్క వాట్సప్ మెసేజ్ ఆమె ప్రాణాలు తీసింది, ఎలా?
గుంటూరు: ఒక్క వాట్సప్ మెసేజ్ ఓ మహిళ ప్రాణాలు తీసింది. చాటింగ్కు బానిసైన మహిళ తన భర్తలో అనుమానాలు పెంచేసి, గొడవకు దిగింది. దాంతో భర్త చేతిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో జరిగింది. తొలుత తన భార్యను దొంగలు హత్య చేసి, నగలు దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త చివరకు తన నేరాన్ని అంగీకరించాడు.
అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి - ఓ రోజు ఉదయలక్ష్మి అనే మాహిళకు వాట్సప్లో ఓ మెసేజ్ వచ్చింది. దాంతో ఆమె కాల్ చేసింది. ఎవరని అడిగింది. తాను వేరేవాళ్లకు ఫోన్ చేయబోతే మీకు వచ్చిందని అవతలి వ్యక్తి చెప్పాడు. ఉదయలక్ష్మి దాంతో ఆపలేదు. అతనితో సంభాషణకు దిగింది. ఆ సంభాషణలో తనది కూడా గుంటూరేనని, తన పేర్ అనిల్ అని అవతలి వ్యక్తి చెప్పాడు.
అప్పటి నుంచి అనిల్ అనే వ్యక్తితో ఉదయలక్ష్మి చాటింగ్ చేస్తూ వచ్చింది. చివరకు ఓ రోజు ఆమె శవమై తేలింది. క్రైమ్ సీన్లో పోలీసులకు ఏ విధమైన ఆధారాలు కూడా దొరకలేదు. ఉదయలక్ష్మి మరణం తర్వాత అనిల్ ఎక్కడున్నది కూడా పోలీసులకు తెలియలేదు. అనిల్తో చాటింగ్ మానేయాలని భర్త వేణుగోపాల్ ఉదయలక్ష్మికి చెబుతూ వచ్చాడు, హెచ్చరించాడు కూడా.
అతని మాటలను ఖాతరు చేయకుండా ఉదయలక్ష్మి చాటింగ్ చేయడాన్ని మరింత ఎక్కువ చేసింది. వేణుగోపాల్ ఆఫీస్కు వెళ్లే ముందు ఉదయలక్ష్మి ప్రతి రోజూ టాటా చెప్పి పంపేసి, ఇంటి పని పూర్తి చేసుకుని చాటింగ్లో మునిగిపోయేది. ఐదు నిమిషాలతో ప్రారంభమైన అనిల్, ఉదయలక్ష్మిల మధ్య చాటింగ్ గంటల తరబడి సాగుతూ వచ్చేది.
ఓ రోజు వేణుగోపాల్ అర్జంట్గా భార్య ఉదయలక్ష్మికి ఫోన్ చేశాడు. అయితే, ఫోన్ స్విచ్ఛాప్ అయినట్లు అతనికి తెలిసింది. వెంటనే అతను ఇంటికి వచ్చి, ఫోన్ స్విచాఫ్ అయితే చూసుకోవా అంటూ భార్యను మందలించాడు. చార్జింగ్ అయిపోయి స్విచాఫ్ అయింది, అంతలా సీరియస్ కావాలా అంటూ ఉదయలక్ష్మి ఎదురు తిరిగింది.
భార్య ఫోన్ చార్జింగ్ ఎందుకు అయిపోయిందనే అనుమానం వేణుగోపాల్కు కలిగింది. దాంతో అతను భార్య ఫోన్ను చెక్ చేశాడు. కాల్ నెంబర్లు, సోషల్ సైట్స్ చెక్ చేశాడు. దీంతో భార్యపై అనుమానం పెరిగింది. చాటింగ్లో భర్తను, పిల్లలను కూడా నిర్లక్ష్యం చేసే దాకా ఉదయలక్ష్మి వెళ్లిపోయింది. చాటింగ్ వద్దని వేణుగోపాల్ చెప్పినప్పుడల్లా మరింత రెచ్చిపోయేది.
బెడ్రూంలో భర్త పక్కనే పడుకున్న సమయంలో కూడా చాటింగ్ చేస్తూ వచ్చింది. విసుగు వచ్చి, వేణుగోపాల్ మొబైల్ లాక్కున్నాడు. ఆ రోజు వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో తన భార్య చాటింగ్కు మాత్రమే పరిమితమైందా, తాను లేనప్పుడు బయటకు కూడా వెళ్తుందా, ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుందా అనే ప్రశ్నలు వేణుగోపాల్ను వేధిస్తూ వచ్చాయి.
ఆ అనుమానంతో ఓ రోజు అకస్మాత్తుగా మధ్యలో వేణుగోపాల్ ఇంటికి వచ్చాడు. భార్య ఇంట్లోనే ఉండి చాటింగ్ చేస్తూ కనిపించింది. దాంతో అతను గొడవ పడ్డాడు. సరదాగా మాట్లాడితే తప్పేమిటి, ఆ మాత్రం స్వేచ్ఛ తనకు లేదా, నేనేమైనా గడప దాటుతున్నానా అంటూ ఆమె భర్తను నిలదీసింది. దాంతో అతను మొబైల్ లాక్కున్నాడు.
ఆమె అతన్ని వెనక్కి నెట్టేసింది. దీంతో రెచ్చిపోయిన వేణుగోపాల్ అమెను చితకబాదాడు. ఈ గొడవలో ఉదయలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. దాంతో వేణుగోపాల్ పరువు పోతుందని భార్య ఫోన్లోని మెసేజ్లన్నీ డిలీట్ చేశాడు. ఆమె గాజులు, నగలు తీసుకుని ఆఫీసుకు వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చి డ్రామా ప్రారంభించాడు. దొంగలు వచ్చి తన భార్యను చంపేసి నగలు ఎత్తుకెళ్లారని నాటకం ఆడాడు.
అయితే, కేసును ఛేదించడం పోలీసులకు సమస్యగా మారింది. పోలీసులు అపార్టుమెంట్ వాచ్మన్ను ప్రశ్నిస్తే ఆ రోజు లోనికి ఎవరూ రాలేదని చెప్పాడు. అపార్టుమెంటులోని మిగతావారిని ప్రశ్నించారు. చివరకు వేణుగోపాల్పై రహస్యంగా నిఘా పెట్టారు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
చివరకు అతను నేరాన్ని అంగీకరించాడు. తాను కాపురం చేయలేక ఆ పనిచేశానని వేణుగోపాల్ చెప్పాడు. అయితే అనిల్ హైదరాబాదులో ఉంటాడని, అప్పుడప్పుడు గుంటూరు వచ్చి వెళ్తుంటాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పుడు అతని ఫోన్ నెంబర్ పనిచేయడం లేదని తెలుస్తోంది. అతను ఉదయలక్ష్మిని ట్రాప్లో పడేయడానికే ఈ పనిచేశాడా అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఉదయలక్ష్మి మరణంతో, వేణుగోపాల్ జైలు పాలు కావడంతో పిల్లలిద్దరు ఒంటరివాళ్లయ్యారు.