వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్-అభద్రతా భావమా ! ఎన్నికలకు తీరిక లేదా?
ఏపీలో దశాబ్దం క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వైసీపీ పేరుతో కొత్త పార్టీ ప్రారంభించి అధ్యక్షుడైన వైఎస్ జగన్ ఇప్పుడు తన పదవిని శాశ్వతం చేసుకునే ప్రయత్నంచేస్తున్నారు. అయితే ఇది సీఎం పదవి మాత్రం కాదు. పార్టీ అధ్యక్ష పదవి మాత్రమే. కుటుంబ రాజకీయాలు, ఏక ధృవ రాజకీయాలే ప్రాధాన్యంగా నడిచే ప్రాంతీయ పార్టీల్లో ఇదో ఆశ్చర్యకరమైన నిర్ణయం గానే కనిపిస్తోంది. ఎందుకంటే జగన్ కాకుండా మరో వ్యక్తి పార్టీని నడిపించే పరిస్ధితులు కానీ, ఆ పదవి నుంచి జగన్ ను తొలగించే అవకాశాలు కానీ దాదాపు లేవు. మరి జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించాల్సిన అవసరం ఎందుకొస్తోంది ?
వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్
వైసీపీకి ఇప్పటివరకూ వ్యవస్ధాపకుడిగా లేకపోయినా పార్టీ ఛీఫ్ గా ఉంటూ వస్తున్న వైఎస్ జగన్ ఇప్పుడు శాశ్వత అధ్యక్షుడిగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో వైసీపీలో అధ్యక్ష ఎన్నికలు లేకుండా శాశ్వతంగా తానే అధ్యక్షుడిగా ఉండేందుకు వీలుగా రేపు పార్టీ ప్లీనరీలో నిర్ణయం తీసుకోబోతున్నాగు. పార్టీ నేతల సాయంతో ఈ నిర్ణయాన్ని ప్రతిపాదించి అందరి మద్దతుతో శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటన చేయించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికలకు తీరిక లేదా?
వైఎస్ జగన్ వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా మారేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఇకపై పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉండవు. మిగతా పదవులకు మాత్రం యథావిధిగా ఎన్నికలు ఉంటాయి. ఇప్పటికే అధికారంలోకి వచ్చాక మూడేళ్లుగా ప్లీనరీ నిర్వహించేందుకు తీరిక లేకుండా సాగిన వైఎస్ జగన్ ప్రస్ధానం.. ఇప్పుడు తాను ఎన్నికయ్యే ఎన్నికలు కూడా నిర్వహించలేని స్ధాయికి చేరిందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
ఎన్నికల పేరుతో ఓ ప్రక్రియ ప్రారంభించడం, అందులో తాను ప్రభుత్వ పాలన సాగిస్తూనే భాగస్వామిని కావడం ఇష్టం లేక జగన్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక కావాలనుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అభద్రతాభావం వల్లేనా?
వైసీపీలో జగన్ తర్వాత ఎవరనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. తన తర్వాత నంబర్ టూ స్ధానంలో ఎవరుండాలనే దానిపై జగన్ ఇప్పటివరకూ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. అయితే పార్టీ నేతలు సజ్జల, విజయసాయిరెడ్డి వంటి వారు మాత్రం జగన్ తరఫున నిర్ణయాలు అమలు చేస్తున్నారు. పార్టీలో కీలక పదవుల్లో ఉన్న వీరిద్దరి తర్వాత మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి మిగతా పెత్తనం అంతా చెలాయిస్తున్నారు.
వీరిలో ఎవరూ జగన్ ను దాటి ముందుకెళ్లే పరిస్ధితుల్లేవు. అలాగని వైసీపీ వ్యవస్ధాపక అధ్యక్షుడు అయిన శివకుమార్ మధ్యలో ఎంటరయ్యే అవకాశాలూ లేవు. అయినా జగన్ శాశ్వత అధ్యక్షుడిగా మారాలనుకోవడం వెనుక ఏదో అభద్రతాభావం వెంటాడుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అంతకు మించిన కారణాలున్నాయా?
వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎంపికయ్యేందుకు అభద్రతా భావమో, తీరికలేని షెడ్యూళ్లో కాదు. అంతకు మించిన కారణాలున్నాయా అనే చర్చ సాగుతోంది. ఓవైపు ప్రభుత్వాన్ని, మరోవైపు పార్టీని ఒంటి చేత్తో మోస్తున్న జగన్.. ఇతరులకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు జంకుతున్నారు.
ఈ సమయంలో పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా తాను ఉంటూ.. మిగతా బాధ్యతల్ని పంచడం ద్వారా పార్టీ భారం తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటికే జిల్లాలవారీగా అప్పగించిన పార్టీ బాధ్యతల్ని మరింత మెరుగ్గా నిర్పహించేందుకు కీలక నేతలకు అవకాశం కల్పిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. దీంతో జగన్ నిర్ణయం వెనుక భారీ ప్లాన్ ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది.