అంతర్రాష్ట్ర జూద నిర్వాహక ముఠా అరెస్ట్
జగ్గయ్యపేట: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూద శిబిరాల నిర్వహణలో ఆరితేరిన ముఠాను బుధవారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నందిగామ డీఎస్పీ రాధేష్మురళి ఈ వివరాలను విలేకరులకు తెలిపారు.
జగ్గయ్యపేట శివారులో సత్యనారాయణపురం రోడ్డులోని గిన్నెచెరువు ఎత్తిపోతల పథకం పక్కనే ఉన్న రేకుల షెడ్డులో జూద శిబిరం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన తెరాస వార్డు కౌన్సిలర్ బెల్లంకొండ శ్రీను, అదే పట్టణానికి చెందిన పిట్టల రవి, జగ్గయ్యపేట మండలం షేర్మహ్మద్పేటకు చెందిన లింగారావు, జగ్గయ్యపేటకు చెందిన చంటి, సాయి, శ్రీనులను అరెస్టు చేశారు.
తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గోదావరి జిల్లాలకు చెందిన మొత్తం 20 మంది రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసుల కళ్లుగప్పి పక్కా పథకంతో జూద శిబిరాలు* నిర్వహిస్తున్నారు. రూ.లక్షల్లో సొమ్ము చేతులు మారుతోంది.
ముందుగానే ఇన్ఫార్మర్లను, కోవర్టులను పెట్టుకుని పోలీసులు వస్తుంటే శిబిరాలు మార్చడం, పోలీసులను దారి మళ్లించడం, సెల్ఫోన్లలో సమాచారమిచ్చి జూద శిబిరాలు, పందేలు నిర్వహిస్తున్నారు. పాల్పడుతున్నారు. జూద శిబిరాల వద్ద రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. అవసమైతే అప్పటికప్పుడు అప్పు ఇచ్చే వ్యక్తులను, తాకట్టు పెట్టుకుని సొమ్ము ఇచ్చే వారిని సిద్ధంగా ఉండటం గమనార్హం.
నిందితులు అందించిన సమాచారం మేరకు కంచికచర్ల మండలం చెవిటికల్లులో రూ.40 లక్షల వరకు చేతులు మారినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న ఎస్సై శ్రీహరిబాబు, జగ్గయ్యపేట పట్టణ పోలీసులను అభినందింంచారు.