కేంద్ర ప్రకటన: ఏపీలోని 4 రైల్వే స్టేషన్లకు అంతర్జాతీయ హోదా
న్యూఢిల్లీ: కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తీపి కబురును అందించింది. ఏపీలోని నాలుగు రైల్వేస్టేషన్లకు అంతర్జాతీయ హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని విజయవాడ, గుంటూరుతోపాటు రాయలసీమలోని కర్నూలు, గుంతకల్లు స్టేషన్లు అంతర్జాతీయ హోదాను కల్పించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఈ స్టేషన్ల ఆధునికీకరణకు రూ.25కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనికి సంబంధించి ఏప్రిల్ 10లోగా ప్రతిపాదనలు పంపాలని అధికారులకు రైల్వేశాఖ ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో ఈ రైల్వే స్టేషన్లు కొత్త రూపును సంతరించుకోనున్నాయి.
ఆర్టీసీ ఛార్జీలు పెంచబోం: అచ్చెన్నాయుడు
విజయవాడ: ఆర్టీసీ ఛార్జీలు పెంచబోమని రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆర్టీసీ కొత్తగా కొనుగోలు చేసిన 10శీతల బస్సులను విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండులో బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థలో నియామకాలకు ఆస్కారం లేకుండా తీసుకువచ్చిన సర్క్యులర్ 7ను నిలిపివేయాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమానికి, ఉద్యోగ భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అందుకే ఉద్యోగులకు ఇబ్బందిగా ఉన్న సర్క్యులర్ను వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు.
అమరావతి పేరుతో ఆర్టీసీ ప్రారంభించిన బస్సులకు మంచి ఆదరణ లభిస్తోందని... ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఇలాంటి బస్సులను తిప్పే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుత బస్సులను ఒక్కోటి రూ.కోటి 20లక్షలతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. గత మూడేళ్లలో డీజిల్ ధరలు లీటర్కు 15రూపాయలకు పైగా పెరిగిన నేపథ్యంలో ఆర్టీసి ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనలు ఉన్నాయా అన్న ప్రశ్నకు.... అలాంటి ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేశారు.