హామీలు తీర్చలేకనే: బాబుపై జగదీష్, కామినేని కౌంటర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీలు నెరవేర్చలేక తమపై బురద చల్లుతున్నారని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్పై, స్థానికతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఆయన తప్పు పట్టారు. ఆయన గురువారంనాడు బ్రెయిలీ పాఠ్యపుస్తకాలను విడుదల చేశారు.
ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అంధ విద్యార్థులకు ఉపయోగపడే బ్రెయిలీ పుస్తకాలను ఆయన అందుబాటులోకి తెచ్చారు. ఫీజు రీయంబర్స్మెంట్ విషయంలో తెలంగాణకు చెందిన ఒక్క విద్యార్థికి కూడా ఇబ్బంది రానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. స్థానికత నిర్ధారణకు తమ వద్ద ఆధారాలున్నాయని ఆయన చెప్పారు.
1956కు ముందు తెలంగాణలో ఉన్నవారినే స్థానికులుగా గుర్తిస్తామని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ రెండు విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో విభేదిస్తోంది.
ఫీజుల చెల్లింపు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలు సరి కాదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుంటే తామే ఇస్తామని ఆయన గురువారంనాడు అన్నారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని గుంటూరు జిల్లాకు మార్చే ప్రతిపాదన ఉందని చెప్పారు.