జగన్ 'ఛాంబర్'కు చిల్లు: చిన్నపాటి వర్షానికే ఇంత అద్వాన్నమా?(ఫోటోలు)
అసెంబ్లీ ప్రాంగణంలో సైతం వర్షపు భారీగా వచ్చి చేరింది. దీంతో సచివాలయం వద్ద ఉన్న గోడను జేసీబీ సహాయంతో కూల్చి నీటిని బయటకు పంపించారు.
అమరావతి: కోట్లు ఖర్చుపెట్టి వెలగపూడిలో నిర్మించిన ఏపీ అసెంబ్లీ కార్యాలయం ఒక్క వర్షానికే లీకేజీ గురవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. తొలి నుంచి ఈ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ తాజా లీకేజీ వ్యవహారంపై మండిపడుతోంది.
వాన నీటికి అసెంబ్లీలోని జగన్ ఛేంబర్ కుదేలు (ఫొటోలు)
ప్రతిపక్ష అధినేత జగన్ చాంబర్ లోని పైకప్పు దెబ్బతినడం వల్ల వర్షపు నీరు లోపలకు చేరింది. దీంతో వర్షం నీటిని బయటకు పంపించడానికి సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. అసెంబ్లీ ప్రాంగణంలో సైతం వర్షపు భారీగా వచ్చి చేరింది. దీంతో సచివాలయం వద్ద ఉన్న గోడను జేసీబీ సహాయంతో కూల్చి నీటిని బయటకు పంపించారు.
వర్షపునీరు చేరడానికి కిటీకీలు తెరిచిఉండడమే కారణం: సిఆర్డీఎ కమిషనర్ శ్రీధర్
ముందే చెప్పామన్న వైసీపీ:
నల్లరేగడి నేలలో నిర్మాణాలు చేపట్టడం సరైంది కాదని తాము తొలి నుంచే చెబతున్నామని, కానీ సీఎం చంద్రబాబు మాత్రం తమ మాటను లెక్క చేయలేదని ఈ వ్యవహారంపై వైసీపీ మండిపడింది. నిర్మాణాల్లో అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నామని గతంలో చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. అదే నిజమైతే ఇంత త్వరగా డ్యామేజీ ఎందుకు జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు.
అప్పట్లో చాంబర్ ఇవ్వకుండా.. ఇప్పుడేమో!
అసెంబ్లీ ప్రారంభం తర్వాత అసలు వైసీపీ అధినేతకు ఛాంబర్ కేటాయించకుండా విమర్శలపాలైన చంద్రబాబు ప్రభుత్వం..ఆ తర్వాత వైసీపీ ఆందోళనతో ఛాంబర్ కేటాయించిన సంగతి తెలిసిందే. అది కూడా టాయిలెట్ పక్కన కేటాయించడంతో వైసీపీ శ్రేణులు సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పుడేమో.. జగన్ ఛాంబర్ నుంచే వర్షం లీకేజీ అవుతుండటంతో.. మరోసారి ఆ పార్టీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బకెట్లు పెట్టాల్సిన పరిస్థితి:
రేకుల ఇంట్లో పైకప్పు పగిలితే.. వర్షం వచ్చినప్పుడు బకెట్లు పెట్టే పరిస్థితిలా అసెంబ్లీ తయారైంది. జగన్ చాంబర్ పైకప్పుకు చిల్లు పడటంతో.. వర్షపు నీరు ఫ్లోర్ పై పడకుండా ఉండేందుకు సిబ్బంది కొన్ని బకెట్లు పెట్టారు. ఛాంబర్ సీలింగ్ కూడా ఊడిపోయింది. ఏసీ, రూఫ్ లైట్ల నుంచి వాన నీరు లీకవడంతో ఛాంబర్ అంతా నీటిమయం అయిపోయింది. అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీతో నిర్మించిన కట్టడం ఇలా చిన్నపాటి వర్షానికే డ్యామేజీ అవడాన్ని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది.
20నిమిషాల వర్షానికే:
20నిమిషాల పాటు కురిసిన వర్షానికే జగన్ ఛాంబర్ చిల్లులు పడి.. ఆపై అసెంబ్లీ ప్రాంగణంలోను పూర్తిగా నీరు నిలిచిపోయింది. ఒకవిధంగా అసెంబ్లీ, సచివాలయం రెండూ జలదిగ్బంధాన్ని తలపించాయి. నిర్మాణం పూర్తయి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాకమునుపే.. భవనాలకు చిల్లులు పడుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంటున్నారు వైసీపీ నేతలు.
మీడియా దృష్టి పడకుండా:
అసెంబ్లీలో వర్షపు నీరు లీకేజీ గురించి బయటకు పొక్కితే పరువు పోతుందని ప్రభుత్వం జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. సోఫాలు, ఇతర ఫర్నీచర్ పూర్తిగా తడిచిపోవడంతో.. మీడియాను అటువైపు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నట్లు చెబుతున్నారు. వాన నీటి లీకేజీని చిత్రీకరించవద్దని మీడియాను వారించినట్లు తెలుస్తోంది. అయినా సరే, వీడియోలు సైతం బయటకు రావడంతో ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
రికార్డులు తడవొద్దని!:
అసెంబ్లీ,సచివాలయంలోని పలు బ్లాకుల్లోకి వర్షపు నీరు చేరడంతో రికార్డులు తడిసిపోకుండా చూడటానికి సిబ్బంది నానా తంటాలు పడ్డారు. సీఎం బ్లాకుతో పాటు, రెవెన్యూ శాఖ, ఇతర బ్లాకుల్లోకి చేరిన నీటిని బకెట్లతో ఎత్తిపోశారు. ఇందుకు చాలా సమయమే పట్టింది. సందర్శకుల కోసం నిర్మిస్తున్న భవనం కూడా వానకు తడిసి బీటలు వారింది. దీంతో జేసీబీతో దాన్ని కూలగొట్టారు.
బాబు పాలనలో డొల్ల:
అసెంబ్లీ భవనంలో వర్షపు నీరు లీకేజీ అవడం బాబు సర్కార్ డొల్లతనానికి నిదర్శనమన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి. వందల కోటల రూపాయల ప్రజాధనాన్ని ఇలాంటి నాణ్యత లేని భవనాల కోసం వెచ్చించారని ఆరోపించారు. భవన నిర్మాణాల్లో అవినీతి చోటు చేసుకున్నందువల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్నారు. దీనికి సీఎం చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఉరుములు మెరుపులతో కూడిన వర్షం:
మంగళవారం రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కృష్ణా, గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షం కురిసింది. భారీ ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
కృష్ణా జిల్లాలో నందిగామ, అవనిగడ్డ, జి కొండూరు, గన్నవరం, గుడ్లవల్లేరు, గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, అమరావతి, నాదెండ్ల, సత్తెనపల్లి, మాచవరం, అచ్చంపేట, క్రోసూరు, తెనాలి, వేమూరు ప్రాంతాల్లో భారీ వర్షం, ఈదురుగాలులు తీవ్ర ప్రభావం చూపించాయి.
గుంటూరు నగరంలో సిమెంట్ స్తంభాలు కుప్పకూలాయి. గుంటూరు జిల్లా కర్లపాలెంలో పిడుగుపాటుకు మసనం పేర్లమ్మ (30) అనే మహిళ మృతిచెందింది. ఇక విశాఖపట్నం జిల్లాలోను విస్తారంగా వర్షాలు కురవగా.. సుమారు 20టీవీలు పిడుగుపాటుకు దగ్గమైపోయాయి.