చీపుర్లు తిరగేస్తే గానీ టీడీపీకి తెలిసిరాదు.. : చంద్రబాబుపై జగన్ ఫైర్
హైదరాబాద్ : ముద్రగడ అరెస్టు.. సాక్షి ఛానెల్ ప్రసారాల నిలిపివేత.. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైసీపీ అధినేత జగన్ ఈ అంశాలపై స్పందిస్తూ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
ప్రజలంతా తిరగబడి అధికార పార్టీ నాయకులకు చీపుర్లు చూపిస్తే గానీ.. ప్రభుత్వానికి తెలిసిరాదని ఎద్దేవా చేశారు జగన్. కాపు ఉద్యమ నేత ముద్రగడ దీక్షపై స్పందిస్తూ.. ముద్రగడ తన సొంతింటిలో దీక్షకు పూనుకుంటే అది శాంతి భద్రతల సమస్య ఎలా అవుతుందని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ముద్రగడకు పరోక్ష మద్దతు తెలియజేసిన జగన్, గత ఎన్నికల్లో ఇచ్చిన హామిల మేరకే ముద్రగడ దీక్ష చేస్తున్నారన్న విషయం చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. ముద్రగడ వ్యవహారంలో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన హామిల అమలు గురించి ప్రశ్నిస్తే.. ప్రభుత్వం ఎదురు దాడులు చేసే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని మండిపడ్డారు.
ముద్రగడ దీక్షను ఏదో తప్పు జరిగిపోతుందన్నట్టుగా ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఆయన, దీక్షను భగ్నం చేసే ప్రయత్నంలో.. ఆఖరికి ముద్రగడ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు కొట్టారని ఆరోపించారు.
ఇక సాక్షి ఛానెల్ ప్రసారాల నిలిపివేతపై కూడా స్పందించిన జగన్.. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించనుందుకే చంద్రబాబు సాక్షిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏపీలో స్వేచ్చాయుత వాతావరణమే లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేసిన జగన్, రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు.