చంద్రబాబు అప్పటి ప్రకటన గుర్తుచేసిన జగన్...ఆయనొస్తే బాగుంటుందని!
కృష్ణా జిల్లా:ఆంధ్ర ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సందర్భంగా చేసిన ప్రచార ప్రకటనను ప్రతిపక్ష నేత జగన్ తన పాదయాత్రలో ప్రత్యేకించి గుర్తుచేశారు.
జగన్ తన పాదయాత్రలో ఏమని చెప్పారంటే.."అప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా "ఆడపిల్లలను బయటకు పంపించాలంటే భయమేస్తోంది...ఆయనొస్తే మహిళలకు బాగుంటుందని"...చంద్రబాబు ను ఉద్దేశించి ఎన్నికలప్పుడు భారీగా ఇచ్చిన అడ్వర్టయిజ్మెంట్లు మీకు గుర్తుండే ఉంటాయి. ఇవాళ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు నిజంగా భయం కలిగిస్తున్నాయని ప్రతిపక్షనేత జగన్ ధ్వజమెత్తారు.
ఇన్ని కేసులా?...కాపాడతారనే కదా?
కృష్ణా జిల్లాలో పాదయాత్ర సందర్భంగా పెడనలో జగన్ మాట్లాడుతూ..." మొన్న మాచెర్ల నియోజకవర్గం ఉప్పుచెర్లలో, నిన్న దాచేపల్లిలో.. ఇలా ఒక్క గుంటూరు జిల్లాలోనే 4 రోజుల్లో 11 కేసులు నమోదయ్యాయి. మహిళలపై నేరాలకు సంబంధించి రాష్ట్రం మొత్తం మీద నాలుగు నెలల్లో 281 కేసులు నమోదయ్యాయి.ఇన్ని ఘటనలు జరిగాయంటే.. తప్పు చేస్తే ప్రభుత్వ పెద్దలు కాపాడుతారన్న ధీమా పెరగడం వల్లే కాదా?...మృగాళ్లు ఇంతగా పేట్రేగిపోవడానికి చంద్రబాబు పాలన కారణం కాదా?...అని టిడిపి పాలనపై ద్వజమెత్తారు.
పాలించే తీరు...మనుషులు మృగాలుగా
చంద్రబాబు ఈ నాలుగేళ్ల పరిపాలనలో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు విపరీతంగా పెరిగి పోయాయని, ఆయన పరిపాలించే తీరు మనుషులను మృగాలుగా మార్చేస్తోందని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. చంద్రబాబు వస్తే మహిళలకు భద్రతలేని పరిస్థితి వచ్చిందని జగన్ అన్నారు. అవినీతి, అబద్ధాలు, మోసాలు.. వీటితో పాటు రోజుకో డ్రామాకు తెరతీస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలన కొనసాగిందని జగన్ విమర్శించారు. ముఖ్యమంత్రే దళారిగా మారి అక్రమాలు చేస్తున్నారన్న వైఎస్ జగన్...చంద్రబాబు సినిమాల్లో నటించి ఉంటే మాత్రం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఉత్తమ విలన్ అనే అవార్డు ఆయనే సొంతం చేసుకునేవారని ఎద్దేవా చేశారు.
మనిషి మృగంగా...ఎలా అంటే?
మనిషి మృగంలా ఎప్పుడు మారతాడంటే అంటూ జగన్ ఇలా విశ్లేషించారు..."తాను తప్పుచేసినా తనను ఎవరూ అడగరని, లేక తాను అధికారంలో ఉన్నానని భావించినప్పుడు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడతాడు. మనం అధికారంలో ఉన్నాం, ఏ తప్పు చేసినా ఏం కాదు...మేం కాపాడతామని ప్రభుత్వాలు హామీ ఇచ్చినప్పుడు...ప్రజలచేత ఎన్నుకోబడిన పంచాయతీలను పక్కనపెట్టి జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వాలు అన్యాయం చేస్తునప్పుడు...మన ఇళ్లు, గుడి ఇలా ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులు పెట్టి దోచుకోవడం మొదలుపెట్టినప్పుడు...వనజాక్షి లాంటి మహిళా అధికారి తన డ్యూటీని నిజాయితీగా చేస్తుంటే.. ఎమ్మెల్యే ఆ మహిళ జట్టుపట్టుకుని ఈడ్చుకువెళ్లినా...సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఆ అరాచకాన్ని అడ్డుకోనప్పుడు...రిషితేశ్వరీ లాంటి విద్యార్థిని సీనియర్ల వేధింపులు గురించి చెబితే...ప్రిన్సిపల్ హస్తం ఉన్నా చర్యలు తీసుకోని సందర్భంలో...కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని చంద్రబాబు బహిరంగంగా మాట్లాడి మహిళలను కించపరిచినప్పుడు మనుషులు మృగాళ్లుగా మారతారంటూ...టిడిపి హయాంలో చోటుచేసుకున్న ఘటనలన్నీ గుర్తు చేస్తూప్రసంగించారు.
ఆ ప్రకటన...గుర్తు చేసుకోండి
ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు, తప్పు చేసేవారిని ప్రోత్సహించినప్పుడు మనిషి మృగంలా మారతాడని జగన్ విశ్లేషించారు. అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలే మహిళల పట్ల వికృతంగా ప్రవర్తిస్తున్నారని ఈ విషయం తాను చెప్పడం కాదని ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చిందని జగన్ చెప్పారు. నాలుగేళ్లుగా మహిళలపై 281 లైంగిక దాడులు జరిగాయని, గత 4 రోజుల్లో 11 ఇలాంటి కేసులు నమోదైనా ప్రభుత్వం పట్టించుకోని కారణంగా మగాళ్లు మృగాళ్లుగా మారుతున్నారు. ఆయన వస్తే బాగుంటుందని టీవీల్లో ఎన్నో ప్రకటనల్లో చంద్రబాబును చూశాం. కానీ నేడు ఏమైంది. చంద్రబాబు పాలనలో అక్కాచెల్లెమ్మలను బయటకు పంపాలంటే భయమేస్తున్న పరిస్థితి ఉంది. గత నాలుగేళ్లుగా ఆత్యాచార కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయో ఆలోచించండి" జగన్ జనాలను కోరారు.
154 వ రోజు...పర్యటన ఇలా
వైఎస్స్ఆర్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 154 రోజులుగా సాగుతుండగా ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. పెడన నియోజకవర్గంలోని కొంకెపూడి శివారు నుంచి ఆదివారం ఉదయం ప్రారంభమైన జగన్ పాదయాత్ర రెడ్డిపాలెం, వడ్లమన్నాడు, వేమవరం, కవుతారం మీదుగా గుడ్లవల్లేరు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి వైఎస్ జగన్ అక్కడ బస చేస్తారు.